
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 13 విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఇవాళ కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్న ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్లును జమ చేయనున్నారు. కానీ ఈ కేవైసీ చేసుకోకుంటే ఈ డబ్బులు అకౌంట్లో జమ కావు. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2000 చొప్పున అందించనున్నారు. ఏడాదిలో మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6వేలు అందిస్తున్నారు.
కర్ణాటకలో శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే శివమొగ్గ ఎయిర్పోర్టును మోడీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో శివమొగ్గ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.