- తయారీ నుంచి పంపిణీ దాకా రివ్యూ
- ఇయ్యాల హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె టూర్
- భారత్ బయోటెక్, జైడస్, సీరమ్ ప్లాంట్ల పరిశీలన
- టీకా తయారీ ప్రోగ్రెస్ తెలుసుకోనున్న ప్రధాని
- గంట పాటు భారత్ బయోటెక్లో వ్యాక్సిన్పై రివ్యూ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ను వీలైనంత తొందరగా జనానికి అందించడంపై ప్రధాని నరేంద్ర మోడీ నజర్ పెట్టారు. అందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ట్రయల్స్ దగ్గర్నుంచి, తయారీ, పంపిణీ వంటి విషయాలపై రివ్యూ చేస్తున్నారు. వ్యాక్సిన్ల ట్రయల్స్, తయారీ ఎంత వరకు వచ్చిందో తెలుసుకుంటున్నారు. దాని కోసమే శనివారం అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్కు వెళ్తున్నారు. ఆ మూడు చోట్ల వ్యాక్సిన్ తయారీ ప్లాంట్లకు వెళ్లి టీకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ప్రధాని ఆఫీస్ అధికారికంగా టూర్ వివరాలను వెల్లడించింది. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మూడు సిటీలకు వెళ్తున్నారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పుణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లాంట్లను పరిశీలిస్తారు’’ అని ట్వీట్ చేసింది.కరోనాతో ఫైట్లో భాగంగా నిర్ణయాత్మక ఫేజ్లోకి ఇండియా ఎంటరైందని, దీంతో ఆయా కంపెనీల సైట్లను పరిశీలించి, వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టులతో మాట్లాడతారని పేర్కొంది. టీకా ప్రిపరేషన్, చాలెంజెస్, పంపిణీకి సంబంధించిన రోడ్మ్యాప్ను ప్రధానికి సైంటిస్టులు వివరిస్తారని చెప్పింది.
మార్చి నాటికి జైడస్ వ్యాక్సిన్
టూర్లో భాగంగా ప్రధాని మోడీ శనివారం ఉదయం 9.30 గంటలకు గుజరాత్లోని అహ్మదాబాద్కు వెళతారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగోదర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని జైడస్ క్యాడిలా ప్లాంట్ను సందర్శిస్తారు. జైకొవ్– డీ వ్యాక్సిన్ను ఆ కంపెనీ తయారు చేస్తున్నది. ఆగస్టులోనే ఫేజ్2 ట్రయల్స్ మొదలయ్యాయి. ఆ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. వెయ్యి మందిపై చేసిన ట్రయల్స్ రిజల్ట్స్ వచ్చే వారం విడుదల చేయనుంది. వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీ బాగుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు మూడో దశ ట్రయల్స్కు సంస్థ రెడీ అవుతోంది. 39 వేల మందిపై డిసెంబర్ నుంచి ట్రయల్స్ మొదలు పెట్టనుంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చి నాటికి టీకాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 10 కోట్ల డోసులను తయారు చేస్తామని కంపెనీ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ చెప్పారు.
45 రోజుల్లో సీరమ్ టీకా!
జైడస్ క్యాడిలా ప్లాంట్ సందర్శన తర్వాత ప్రధాని అక్కడి నుంచి నేరుగా పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్లాంట్కు చేరుకుంటారు. ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనికా టీకాను ఇండియాలో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని 17 సైట్లలో టీకా కొవిషీల్డ్పై మూడో ఫేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇటీవల ఆక్స్ఫర్డ్ విడుదల చేసిన ఇంటరిమ్ డేటా అనాలిసిస్ ప్రకారం.. 60 నుంచి 70 శాతం వరకు టీకా ప్రభావం ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే మరింత కట్టుదిట్టంగా ట్రయల్స్ చేయాలని సీరమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, టీకా ఎఫెక్ట్ 60 నుంచి 70 శాతం ఉన్నా వ్యాక్సిన్ను వేసుకోవచ్చని, వైరస్పై టీకా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వివిధ వయసుల వారిపై ట్రయల్స్ చేస్తున్నందున ఫలితాలు ఇలా వచ్చాయని, భయపడకుండా కాస్త ఓపికతో వేచి చూడాలని కోరింది. కాగా, టీకాను 45 రోజుల్లో మార్కెట్ చేసేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ మార్కెటింగ్ ఆథరైజేషన్’ ఇవ్వాలని కోరుతూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు అప్లికేషన్ పెడతామని 4 రోజుల క్రితం కంపెనీ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పారు. వ్యాక్సిన్ ఫుల్ డోస్ (2 డోసులు)కు అనుమతులు పొందిన ఒకే ఒక్క కంపెనీ సీరమ్ అని, కాబట్టి ఎమర్జెన్సీ అప్రూవల్ వస్తే ఫుల్ డోసును వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సగం డోస్నే వేస్తామంటే కచ్చితంగా ‘హాఫ్ డోస్ ట్రయల్స్’ చేయాల్సి ఉంటుందని అన్నారు.
భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్ రిజల్ట్స్ బాగున్నయ్
కరోనాకు ఫస్ట్ దేశీ వ్యాక్సిన్ కొవ్యాగ్జినే కావడం విశేషం. హైదరాబాద్లోని భారత్బయోటెక్ కంపెనీ దానిని అభివృద్ధి చేసింది. శనివారం పుణే నుంచి నేరుగా ప్రధాని మోడీ జీనోమ్ వ్యాలీలోని భారత్బయోటెక్ ప్లాంట్కు చేరుకుంటారు. అక్కడ వ్యాక్సిన్ తయారీ తీరుతెన్నులను తెలుసుకుంటారు. గంట సేపు అక్కడే ఉంటారు. ప్రస్తుతం కొవ్యాగ్జిన్కు సంబంధించి థర్డ్ ఫేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు 26 వేల మందిపై దానిని టెస్ట్ చేస్తున్నారు. ట్రయల్స్లో టీకా పనితీరు బాగున్నట్టు ఆ ట్రయల్స్ చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబైల్లో ట్రయల్స్ నడుస్తున్నాయి. గురువారమే అహ్మదాబాద్లోనూ మొదలయ్యాయి. సోలా సివిల్ హాస్పిటల్లో ఐదుగురికి ప్రాథమికంగా టీకా వేశారు. శుక్రవారం మరో పది మందికి ఇచ్చారు. మరింత మంది వలంటీర్లు టీకా ట్రయల్స్కు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వలంటీర్లలో చెడు ప్రభావాలు కనిపించలేదని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చెప్పారు. కోల్కతాలోనూ ట్రయల్స్ చేయనుంది కంపెనీ. వెయ్యి మంది వలంటీర్ల కోసం వేచి చూస్తోంది.
హెటిరోలోనూ స్పుత్నిక్ టీకా తయారీ
హైదరాబాద్: స్పుత్నిక్V టీకాలను మన దేశంలో వీలైనంత ఎక్కువగా తయారు చేసేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్తో ఒప్పందం చేసుకున్న రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్).. తాజాగా హైదరాబాద్కే చెందిన హెటిరోతోనూ జట్టుకట్టింది. 10 కోట్ల డోసులను తయారీకి అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. స్పుత్నిక్ టీకాలను వీలైనంత ఎక్కువగా తయారు చేస్తామని, ఇండియా ప్రజలకు అందిస్తామని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. లోకల్గా వ్యాక్సిన్ను తయారు చేయడం ద్వారా ప్రజలకు వేగంగా టీకాను అందించొచ్చని హెటిరో ల్యాబ్స్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డైరెక్టర్ బి. మురళీ కృష్ణా రెడ్డి చెప్పారు.