11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ

11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇటీవల తాను చేపట్టిన ఉపవాస దీక్షను విరమించారు. రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని 11 నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగిన తర్వాత రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప్రధానికి పూజ కోసం ఉపయోగించిన పానీయాన్ని తాగించారు. 

ఇది నా అదృష్టం

రాముడి కోసం 11 రోజుల పాటు ఈ దీక్షను పాటించినందుకు ట్రస్ట్ సభ్యుడు ప్రధానిని అభినందించారు. ఇటీవల తాను 11 రోజుల పాటు ప్రత్యేక అనుష్ఠానాం పాటించనున్నట్లు ప్రధాని మోదీ జనవరి 12వ తేదిన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. రామాలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించే అదృష్టం నాకు దేవుడిచ్చాడంటూ వ్యాఖ్యానించారు. అనుష్ఠానం నియమాల్లో భాగంగా కేవలం దుప్పటి మాత్రమే వేసుకొని నెలపై నిద్రించారు.

దేశవ్యాప్తంగా ఉత్సవాలు

అలాగే కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. సూర్యుడు రాకముందే నిద్ర లేవడం, యోగా, ధ్యానం చేయడం వంటివి చేశారు. అలాగే నిత్యం రాముని కీర్తనలు వింటూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. భారీ భద్రత నడుమ విజయవంతంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. ఈ వేడుక జరిగిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ఉత్సవాలు జరుపుకుంన్నారు. ఎక్కడ చూసినా రాముని నామస్మరణ  మారుమోగిపోయింది.