అనుకున్నట్టే అమిత్ షా ఎంట్రీ.. కిషన్రెడ్డికి చోటు
రాష్ట్రపతి భవన్లోని ఫోర్కోర్టులో అట్టహాసంగా ప్రమాణస్వీకారం
కేబినెట్ మినిస్టర్స్: 25, ఇండిపెండెంట్ మినిస్టర్స్: 9, ఎంవోఎస్: 24
మంత్రిగా మాజీ ఫారిన్ సెక్రటరీ జైశంకర్.. ఆరుగురు మహిళలు కూడా
వేడుకకు బిమ్స్టెక్ దేశాధినేతలు, 8 వేల మంది అతిథులు హాజరు
జైట్లీ, సుష్మ మిస్.. మేనక, సురేశ్ప్రభు, రాథోడ్ తదితరులు ఔట్
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. సుమారు 8000 మంది అతిథులు తరలివచ్చారు. మోడీతో కలిపి మొత్తం 58 మందితో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. గురువారం సరిగ్గా రాత్రి 7 గంటల ఐదు నిమిషాలకు 68 ఏళ్ల మోడీ ‘‘మై నరేంద్ర దామోదర్దాస్ మోడీ’’ అంటూ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ చీఫ్ అమిత్షా, మాజీ ఫారిన్ సెక్రటరీ జైశంకర్కు కేబినెట్ మంత్రి హోదా దక్కింది. తెలంగాణ నుంచి కిషన్రెడ్డికి సహాయమంత్రి పదవి లభించింది. బిమ్స్ టెక్లోని బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్, నేపాల్, భూటాన్ దేశాల అధినేతలు వేడుకకు హాజరయ్యారు. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు. అందులో నాటి పాక్ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్కు ఆహ్వానం అందలేదు. రాత్రి 9 గంటలకు బెంగాల్కు చెందిన దేబశ్రీ చౌదరి ప్రమాణంతో ప్రమాణ స్వీకారాలు ముగిశాయి. అటు తర్వాత ప్రధాని మోడీ.. తన మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. బిమ్స్ టెక్ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కేబినెట్లోకి షా, కొత్తవారికి చాన్స్
మోడీ కేబినెట్లోకి బీజేపీ చీఫ్ అమిత్ షా వస్తారన్న వార్తలు నిజమయ్యాయి. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోడీ, అమిత్ షా విస్తృతంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం లిస్టు ఫైనల్ అయ్యాక.. ఎంపీలకు సమాచారం అందించి, మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీగా ఉండాలని ఆహ్వానించారు. సాయంత్రం ఆరు తర్వాతే ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారనే విషయం బయటకు వచ్చింది. మోడీ తర్వాత రాజ్నాథ్ ప్రమాణం చేయగా.. అటు తర్వాత అమిత్ షా ప్రమాణం చేశారు. ప్రధానిగా మోడీ, మంత్రులుగా 57 మంది ప్రమాణం చేశారు. ఇందులో 25 మందికి కేబినెట్మంత్రి హోదా, 9 మందికి స్వతంత్ర మంత్రి హోదా, 24 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. గత కేబినెట్మంత్రులుగా చేసిన పలువురికి కూడా ఈ సారి చోటు దక్కింది.
అందులో రాజ్నాథ్, గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్సిమ్రత్ కౌర్ బాదల్, తావర్చంద్ గెహ్లాట్, స్మృతి ఇరానీ, హర్షవర్దన్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్, గిరిరాజ్సింగ్, సంతోష్ గంగ్వార్, వీకే సింగ్ వంటి పలువురు ఉన్నారు. మాజీ ఫారిన్ సెక్రటరీ జైశంకర్ను కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. ఆయన అటు రాజ్యసభలో కానీ.. ఇటు లోక్సభలో కానీ సభ్యుడు కాదు. త్వరలో జైశంకర్ను రాజ్యసభకు ఎన్నుకునే అవకాశం ఉంది. పలువురు కొత్తవారికి కూడా కేబినెట్లో చోటు లభించింది. అందులో తెలంగాణ నుంచి కిషన్రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అరవింద్ సావంత్, ప్రహ్లాద్సింగ్ పటేల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, దేబశ్రీ చౌదరి వంటి వారు ఉన్నారు. పాతవారిలో అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, మేనకా గాంధీ, సురేశ్ ప్రభు, రాజ్యవర్ధన్సింగ్, ఉమాభారతి, జేపీ నడ్డా వంటి పలువురికి చోటు దక్కలేదు. జైట్లీ, సుష్మ తమకు ఆరోగ్యం సహకరించడం లేదని, కేబినెట్లోకి రాలేమని ముందే మోడీ దృష్టికి తెచ్చారు. బీజేపీ చీఫ్ పదవికి జేపీ నడ్డా పేరు పరిశీలనలో ఉన్నందున ఆయనకు కేబినెట్లోకి తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ సారి కేవలం ఆరుగురు మహిళలకే కేబినెట్లో చోటు కల్పించారు. గత కేబినెట్లో ఎనిమిది మంది మహిళలు ఉండేవారు.
ప్రమాణంలో తడబడి
ప్రమాణం చేసేటప్పుడు పలువురు మంత్రులు తడబడ్డారు. రాత్రి సమయం కావడం, రంగు రంగుల విద్యుత్ వెలుగులు విరజిమ్మడంతో వారికి ప్రమాణపత్రంలోని అక్షరాలు సరిగ్గా కనిపించలేదు. జితేంద్రసింగ్వంటి సీనియర్ మంత్రులతో పాటు కొందరు కొత్తవారు కూడా తప్పుగా పలికారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కల్పించుకొని తప్పులను సరిచేస్తూ ఇలా పలకాలని ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది.
రాష్ట్రపతి ప్రత్యేక విందు
ప్రమాణస్వీకారోత్సవం అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విదేశీ అతిథులతోపాటు పలువురు ఇక్కడ నేతలు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ‘దాల్ రైసినా’ అనే స్పెషల్ వంటకాన్ని అతిథులకు వడ్డించారు.
తరలివచ్చిన నేతలు, ప్రముఖులు
ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు తరలివచ్చారు. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషితో పాటు ఆ పార్టీలోని కీలక నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేక జైట్లీ రాలేదు. ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కర్నాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, షాహిద్ కపూర్, బోనీ కపూర్, ఆధ్యాత్మిక గురువు జగ్గివాసుదేవ్, ఇండస్ట్రియలిస్టు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, ఎల్ఎన్ మిట్టల్, గౌతమ్ అదానీ వంటి వారు కూడా తరలివచ్చారు. బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కో ఆపరేషన్) దేశాల తరఫున బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ ప్రెసిడెంట్ యు విన్మింట్, భూటాన్ ప్రధాని లోతె షేరింగ్ పాల్గొన్నారు. కిర్గిస్తాన్ ప్రెసిడెంట్, మారిషస్ ప్రధాని కూడా హాజరయ్యారు. బెంగాల్లో రాజకీయ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులను ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మోడీ, అమిత్షా, స్మృతి ఇరానీ ప్రమాణం చేస్తున్నప్పుడు అతిథుల నుంచి విశేష స్పందన లభించింది.