గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని రణిప్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న సోమాభాయ్ మోదీ మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ బయట వారిద్దరూ ఒకరినొకరు పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సోమాభాయ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తమ తల్లి హీరాబాయి స్వర్గం నుంచే మోదీని ఆశీర్వదించి ఉంటుందని అన్నారు. అందరిలాగే తాను కూడా మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, సరైన వ్యక్తిని, సరైన పార్టీని ఎన్నుకోవాలని కోరారు.