
కూసుమంచి, వెలుగు: స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ టీచర్పై పోక్సో కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం అప్పర్ ప్రైమరీ స్కూల్లో గుడిపూడి వీరయ్య అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఇతడు ఈ నెల 16న డిప్యుటేషన్పై వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు.
అయితే సదరు టీచర్ 4, 5వ తరగతి బాలికలపై చేతులు వేస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు రావడంతో హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఇన్చార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ శ్రీజ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో బాలిక సంరక్షణ విభాగం లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఎంఈవో రామాచారి మంగళవారం నర్సింహులగూడెం స్కూల్కు వెళ్లి బాలికలు, తల్లిదండ్రులు, టీచర్లను విచారించి పూర్తి స్థాయి రిపోర్ట్ను ఉన్నతాధికారులకు అందజేశారు. వీరయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో అతడిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు టీచర్ వీరయ్యపై పోక్సో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.