కాళోజీ నారాయణ రావు 9 సెప్టెంబర్ 1914న వరంగల్ జిల్లా, మడికొండ గ్రామంలో జన్మించారు. ఆయన తెలుగు భాషతో పాటు, ఉర్దూ, పార్శీ, మరాఠి, ఇంగ్లిష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆనాటి కవులలో సుప్రసిద్ధులైన శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, అనిశెట్టి తదితరులు ఉన్నారు.
అభ్యుదయ కవులలో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో దాశరథి, కాళోజీ, సురవరం ప్రతాపరెడ్డిలను అత్యాధునికులుగా కొనియాడారు. అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఎక్కడెక్కడ దేశంలో దౌర్జన్యాలు జరిగినా కాళోజీ గళమెత్తి తిరుగుబాటు చేశారు.
‘సత్యాహింసల యేబదేండ్ల కృషి.. క్షణంతో అయిపోయేను మసి’. బాపూజీ బతికినప్పటి సత్యాహింసల దుప్పటి.. బొంకుల బొంతగ మారెను. ఘనతలు సాంతము దీరెను’. ‘ప్రజాస్వామ్యం గణరాజ్యం చతుర నాయకమన్యుల భోజ్యం. తోడేలు అండనున్న మేకలు ‘బ్యా’ అన్న ఊడిపోవు పీకలు’. అని ఆనాటి స్థితిని వర్ణించారు కాళోజీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణోపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎగువ సభ మెంబర్గా ఎన్నికయ్యారు. కొంతకాలం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.
ప్రజలకు మేలు కొలుపు
‘లాఠీదెబ్బల లక్ష్యమేమీ కఠిన శిక్షయె కాదు కాదు. చావుకైనను జంకనీయదు మాతృదేశం మాతృదేశమే’ అని గళమెత్తారు. తన మాతృభూమి అయిన తెలంగాణలో బీద ప్రజల దైన్యాన్ని, అధికారుల విలాసాల్ని, దుర్మార్గాలని చూసి కాళోజీ హృదయం దహించుకుపోయింది.
ప్రజల బానిస బతుకులు చూసి నేత్రాలు నిప్పులను విరజిమ్మాయి. ధైర్యంతో నైజాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ‘బాధ్యత లేని ప్రభుత్వాలు, ప్రభుత్వ భటులు పెట్టే బాధలు చాలింక, బాధ్యతగల పరిపాలన లేక బతికిన బతుకులు చాలింక’ అని తన కవిత్వాలతో గర్జించారు.
కోరిక తీరింది కానీ..
చివరకు కాళోజీ త్యాగం ఫలించింది. అభిలాష నెరవేరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. తర్వాత హైదరాబాద్లో నిరంకుశపాలన అంతమైంది. విశాలాంధ్ర కూడా ఏర్పడింది. కానీ, కాళోజీ ఆత్మకు నిజమైన శాంతి లభించలేదు. మనకు స్వరాజ్యం వచ్చింది కానీ సురాజ్యం రాలేదు. ‘మాయాలోకం మాయజనుల మనసులో గల మాట యొకటి పైకి నుడివెడు పలుకు ఒకటి. చేయదలచిన చేష్ట ఒకటి’. ఆయన గొడవ అందరి గొడవ.
కాళోజీ రచించిన ‘నా గొడవ’ ప్రథమ ముద్రణ 12 జనవరి 1953న ఆవిష్కరణ అలంపూర్ సభలో జరిగింది. కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు తెలంగాణ అంచులు గోడలుగా అడ్డు నిలవవు. ఆయన ఖండ కావ్యానికి ‘ నా గొడవ’ అని పేరు పెట్టారు.
కాళోజీ రచనలు
నా భారతదేశ యాత్ర (1943). ఇది బ్రేల్స్ఫర్డ్ రాసిన రెబల్ ఇండియా అనువాదం. నా గొడవ, తుది విజయం మనది నిజం, జీవన గీత. 1972వ సంవత్సరంలో భారత ప్రభుత్వం కాళోజీని స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి భారత ప్రభుత్వం తామ్రపత్రం ప్రదానం చేసింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సత్కారం పొందారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అని చాటి చెప్పారు.
కాళోజీ తన 89వ ఏట తొడ ఎముక విరగడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరి నవంబర్ 13, 2002వ సంవత్సరంలో కన్నుమూశారు. కాళోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తోంది. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీకి ఘనంగా నివాళి అర్పిద్దాం.
కె. ప్రభాకర్
