మహిమ గల పెట్టె అంటూ మోసాలు

మహిమ గల పెట్టె అంటూ మోసాలు


జనగామ అర్బన్, వెలుగు:  ఓ బాక్స్​లో ఎలక్ట్రానిక్​డివైస్​ అమర్చి అయస్కాంతం పెడితే వైబ్రేషన్స్​వచ్చేలా చేసి మహిమ గల పెట్టె అంటూ అమాయకులను బురిడీ కొట్టించిందో  ముఠా. ఇప్పటికే ఆరుగురి దగ్గర అడ్వాన్స్​ తీసుకుని తప్పించుక తిరుగుతున్నారు. మరో బాక్స్​అమ్మేందుకు హైదరాబాద్​ నుంచి వరంగల్​వస్తుండగా సోమవారం జనగామ మండలం పెంబర్తి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జనగామ ఏసీపీ దామోదర్​ రెడ్డి కథనం ప్రకారం..నాగర్​కర్నూల్ ​జిల్లా ఆమ్రాబాద్ ​మండలం మున్ననూరుకు చెందిన కేతావత్ ​శంకర్, నారాయణపేట జిల్లా మక్తల్ ​మండలం సంగంబండ గ్రామానికి చెందిన ఖాసీం, వికారాబాద్​ జిల్లా తాండూరుకు చెందిన మహ్మద్​ అజార్, నల్లగొండ జిల్లా దిండి మండలం దేవత్​పల్లి తండాకు చెందిన కొర్ర సాసీరాం ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్​ వేశారు.

 ఒక పెట్టెను కొని దానికి ఎలక్ట్రానిక్ ​డివైస్​అమర్చారు. పెట్టెపై అయస్కాంతం పెడితే వైబ్రేషన్​వచ్చేట్టు చేశారు. పిడుగు పడ్డప్పుడు వచ్చే మెటల్​తో తయారు చేశామని, మహిమలు ఉన్నాయని..ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని పలువురిని నమ్మించారు. ధర రూ.50 కోట్లు ఉంటుందని చెప్పి రూ.5 నుంచి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకునేవారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు అడ్వాన్స్​తీసుకుని ఉడాయించేవారు.  ఇలా ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారు. సోమవారం వరంగల్​లో ఓ వ్యక్తి బాక్స్​ కొనేందుకు ఆసక్తి చూపడంతో ఆటోలో పెట్టెను పట్టుకుని వెళ్తుండగా జనగామ పోలీసులకు చిక్కారు. నలుగురు నిందితులను అరెస్ట్ ​చేసి ఆటో, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జనగామ ఎస్సై సృజన్,కానిస్టేబుళ్లు కరుణాకర్, రామన్న, అనిల్​, సాగర్​లను ఏసీపీ అభినందించారు. సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై శ్వేత ​పాల్గొన్నారు.