వాట్సాప్ స్టేట‌స్‌లో ఫోటో.. త‌ల్లీకొడుకులు అరెస్ట్

వాట్సాప్ స్టేట‌స్‌లో ఫోటో.. త‌ల్లీకొడుకులు అరెస్ట్

హైద‌రాబాద్: తన గొప్ప చూపించుకోవడానికి ఓ తల్లి చేసిన పని కొడుకును జైలు పాలు చేసింది. నెక్లెస్ వేసుకుని దిగిన తన ఫోటోను ఓ మహిళ వాట్సప్ స్టేటస్ గా పెట్టింది. అది చూసిన పక్కింటివాళ్లు తమ ఇంట్లో పోయిన నగ అదేనని ఫిర్యాదు చేయడంతో.. అది దొంగిలించిన కొడుకుతో పాటు.. తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

గ‌తేడాది జూలై 12, 2019లో సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి వ‌చ్చేలోగా త‌న‌ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే రాచ‌కొండ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అయితే చోరికి గురైన బంగారం ల‌భించ‌క‌పోవ‌డంతో ఆ కేసు అలాగే ఉండి పోయింది. చోరీ జరిగి 15 నెలలు కావస్తుండడంతో పోయిన సొమ్ము గురించి సాయికిరణ్ కుటుంబం మర్చిపోసాగింది.

తాజాగా వారి ఇంటి పక్కన ఉండే మహిళ సాయికిరణ్‌ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని దిగిన ఫోటోను వాట్సాప్‌ స్టేటస్ పెట్టింది. ఇది చూసిన సాయికిరణ్‌ అది తమ ఇంట్లో చోరీకి గురైన‌ న‌గ అదేన‌ని గుర్తించి పోలీసులకు తెలిపాడు. ‌పోలీసులు దర్యాప్తు చేయగా ఆ మహిళ కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లికి తెలిసే జరిగిందని పోలీసులు తెలిపారు. కొడుకును అరెస్ట్ చేసి ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. పోయిందనుకున్న సొమ్ము మళ్ళీ దొరకడంతో సాయికిరణ్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.