సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై జరిగిన దాడి కేసులో మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బోయగూడ రైల్వేకోర్టులో హాజరుపరుచగా..న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇందులో కొందరు వాట్సప్ అడ్మిన్ గ్రూప్ అడ్మిన్ లుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులను కోర్టుకు తరలిస్తుండగా వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 55మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నారు. అతడిని నరసరావుపేటను హైదరాబాద్ కు తరలించిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తుననారు.
ఇక రెండో రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. ‘‘సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులైన సుబ్బారావు, శివలు నిరసనకారులకు సహకరించారు. సుబ్బారావు, శివలు దాడులు చేయాలని చెప్పినట్లు విద్యార్థులు చెప్పుకున్నారు. హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో ఫోటోలను సుబ్బారావు, శివలు షేర్ చేశారు. అల్లర్లకు కావాల్సిన పెట్రోల్, కర్రలులు, రాడ్లు సమకూర్చారు. అంతేకాకుండా అభ్యర్థులు స్టేషన్ వరకు చేరేందుకు రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు
