
బషీర్బాగ్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ మహిళ వద్ద రూ.కోటి కాజేసిన ఆన్లైన్ చీటర్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపిన ప్రకారం.. తార్నాకకు చెందిన 34 ఏళ్ల మహిళకు సైబర్ చీటర్లు ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్ ద్వారా నకిలీ ట్రేడింగ్ లింక్స్ లు పంపించి పెట్టుబడులు పెట్టించారు. మొదట కొంతమొత్తంలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చినట్లు చూపించారు.
దీంతో వారిని నమ్మిన సదరు మహిళ 2025 జనవరి నుంచి జులై వరకు పలు దఫాలుగా రూ.కోటి 5 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. ఆ తరువాత వారు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హర్షవర్ధన్ , కొండూరు వేణు , మైలారం ప్రదీప్, పచ్చిపల వినోద్ యాదవ్ , పరసనబోయిన వంశీ, మంగలి లక్ష్మణ్ అనే ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఆరుగురి వద్ద 15 డెబిట్ కార్డులు , 3 పాస్ బుక్స్ , చెక్ బుక్ , 8 ఫోన్లు, ఫింగర్ ప్రింట్ మిషన్, స్కానర్ లను సీజ్ చేశారు.