
- ఎల్ఎస్డీ బ్లట్స్, హాష్ ఆయిల్, ఫారిన్ లిక్కర్ సీజ్
చేవెళ్ల, వెలుగు: పార్టీల పేరుతో పలువురు ఐటీ ఉద్యోగులు పెడదోవ పడుతున్నారు. లక్షల్లో జీతాలు ఉండడంతో ఖరీదైన లిక్కర్తోపాటు విదేశాల నుంచి డ్రగ్స్తెప్పించుకొని విచ్చలవిడిగా ఎంజాయ్చేస్తున్నారు. ఇందుకోసం సిటీ శివారులోని ఫామ్హౌస్లను ఎంచుకొని చిందులు తొక్కుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఆరుగురు ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ తో పట్టుబడడం కలకలం సృష్టించింది. వీరంతా ప్రముఖ ఐటీ సంస్థకు చెందినవారే కావడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ తన బర్త్ డే పార్టీ కోసం శనివారం రాత్రి మొయినాబాద్ మండలం మేడిపల్లి పరిధిలోని సెరీనా ఆర్కుడ్ ఫామ్ హౌస్ను బుక్ చేశాడు.
తొటీ ఉద్యోగులను పార్టీకి పిలిచి, ఫారిన్ లిక్కర్తో డ్రగ్స్ అరెంజ్ చేశాడు. వీరంతా ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తుండగా, ఎక్సైజ్ శాఖ, స్టేట్ టాస్క్ ఫోర్స్సమాచారంతో చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు దాడి చేశారు. అభిజిత్ బెనర్జీతో పాటు తోటి స్నేహితులు సమ్సన్, పార్థు, గోయల్, యశ్వంత్, సివోడెనిస్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 0.05 గ్రాముల ఎల్ఎస్డీ బ్లట్స్, 20.21 గ్రాముల హాష్ ఆయిల్, 5 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ పరీక్షలో అందరూ డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ ఆపరేషన్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.