- ఒకే బ్యాంకులో రెండుసార్లు చోరీకి యత్నం
- పట్టించిన సిమ్కార్డ్లేని సెల్ఫోన్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రెండు సార్లు చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. మొదటిసారి చోరీ చేసినా ఆధారాలు దొరక్కపోవడంతో తప్పించుకొని తిరుగుతున్న ఈ దొంగ.. రెండోసారి అదే బ్యాంకులో స్ట్రాంగ్రూమ్ తాళం పగలగొట్టే క్రమంలో సైరన్ మోగడంతో పారిపోయాడు.
ఈసారి ఆధారాలు సేకరించిన పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నెన్నెల పీఎస్లో బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్కుమార్, ఎస్సై శ్యాంపటేల్ వివరాలు తెలియజేశారు. కోణంపేట గ్రామానికి చెందిన నాయిని బాపు(31) ప్రైవేట్ టీచర్గా, కస్టమర్ సర్వీస్సెంటర్ మినీ ఏటీఎం నిర్వాహకుడిగా పనిచేసేవాడు. ఆన్లైన్లో పేకాటకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయాడు.
పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని బ్యాంకులో చోరీకి ప్లాన్ వేశాడు. మొదటిసారి ఆగస్టు 31న గ్రామీణ బ్యాంకులో చోరీకి వచ్చి నగదు ఏమీ దొరక్కపోవడంతో ‘గుడ్ బ్యాంక్. ఒక్క రూపాయి కూడా దొరకలే. నా ఫింగర్ఫ్రింట్ లభించదు. నన్ను పట్టుకోవద్దు’ అని పేపర్పై రాసి వెళ్లాడు. మరోసారి నెల తర్వాత సెప్టెంబర్30న బ్యాంకు కిటికీ గ్రిల్ను తొలగించి లోపలికి ప్రవేశించాడు.
స్ట్రాంగ్రూం తాళం పగులగొడుతుండగా అలారం మోగడంతో భయపడిపోయి టార్చ్లైట్లా ఉపయోగించేందుకు తెచ్చుకున్న సిమ్కార్డు లేని చిన్న ఫోన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ సెల్ఫోనే దొంగను పట్టుకునేందుకు ఉపయోగపడింది. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు బాపును పట్టుకున్నారు. పోలీసులు వెతుకుతున్న విషయం తెలుసుకొని ఆటోలో పారిపోతున్న నిందితుడిని నెన్నెల టీ రోడ్డు వద్ద పట్టుకున్నారు. గతంలో ఇతడిపై దేవాపూర్, రెబ్బెన, మాదారం, మందమర్రి, తిర్యాణి తదితర పోలీస్స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయని సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై శ్యాంపటేల్, హెడ్కానిస్టేబుల్విజయ్ను సీఐ అభినందించారు.