సికింద్రాబాద్, వెలుగు: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ11.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం..ఒడిశాలోని గజపతి జిల్లా మోహన తండాకు చెందిన శిల్పా నాయక్(27) భర్త 2018లో మృతి చెందాడు. కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో రాజీవ్నాయక్ అనే గంజాయి స్మగ్లర్ తో ఆమె చేతులు కలిపింది. ఇద్దరూ కలిసి ఈ నెల 16న మోహన తండా సమీపంలోని అడవికి వెళ్లి ఓ వ్యక్తి వద్ద కిలో రూ.3వేల చొప్పున 46 కిలోల గంజాయి కొన్నారు. దాన్ని 23 ప్యాకెట్లుగా కట్టి నాలుగు బ్యాగుల్లో ప్యాక్ చేశారు.
ఆ ప్యాకెట్లను ముంబైకి తరలించే క్రమంలో 17న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడ శిల్పా నాయక్కు భోజనం తీసుకువచ్చేందుకు రాజీవ్ నాయక్ బయటకు వెళ్లగా..ఆమె గంజాయి బ్యాగులతో ప్లాట్పారంపైనే వేయిట్ చేసింది. శిల్పా నాయక్ అనుమానాస్పదంగా కనిపించడంతో స్టేషన్పోలీసులు ఆమె బ్యాగులను చెక్ చేశారు. అందులో 46 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శిల్పా నాయక్ అరెస్టుతో రాజీవ్ నాయక్ పరారయ్యాడు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.