
ముంబై: సిటీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో వైరస్ కంట్రోల్ కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) చర్యలు చేపట్టింది. గురువారం కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. వీటి అమలులో కఠినంగా ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపైన ఎవరైనా కరోనా గైడ్లైన్స్ ఉల్లంఘిస్తూ పట్టుబడితే ఏకంగా పోలీస్ కేసు పెడతామని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. సిటీలోని ఏ ఏరియాలోనైనా ఐదు, అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన బిల్డింగ్ను సీల్ చేస్తామని తెలిపారు. హోం క్వారెంటైన్లో ఉన్నోళ్ల చేతిపై స్టాంప్ వేస్తామని అన్నారు. మరోవైపు, సిటీలోని వేర్వేరు ఏరియాల్లో 300 మంది మార్షల్స్ను నియమించి మాస్క్ పెట్టుకోకుండా బయటికి వచ్చిన వాళ్ల నుంచి బీఎంసీ ఫైన్ వసూలు చేపిస్తున్నట్లు వివరించారు. లోకల్ ట్రైన్లలో మాస్క్లేని ప్రయాణికులకు భారీగా ఫైన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ లేకుండా కనిపించిన వారిపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లతో పాటు హోటళ్లు, ఆడిటోరియం, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో కరోనా గైడ్లైన్స్ పాటిస్తున్నదీ లేనిదీ చెక్ చేసేందుకు స్పెషల్ టీమ్లతో రైడ్ చేస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు. కొత్త గైడ్లైన్స్ ప్రకారం.. దేశంలోన ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్లలో క్వారెంటైన్ ఉండాలె. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో టెస్టింగ్ కెపాసిటీని ప్రభుత్వం పెంచుతోంది.