- ప్రభుత్వ వ్యతిరేక కంటెంటే కారణం
- 45 మంది అదుపులోకి..?
- కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ల సీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ చానల్స్పై పోలీసులు గురువారం దాడులు చేశారు. వరంగల్ లోని కాళోజీ, జీఎస్ఆర్ సహా రాష్ట్రంలోని 18కి పైగా యూట్యూబ్ చానళ్ల ఆఫీసుల్లో రైడ్స్ నిర్వహించారు. సుమారు 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. చానల్ పర్మిషన్స్, టెలికాస్ట్ చేస్తున్న వార్తల డేటాను కలెక్ట్ చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, సీఎం, మంత్రులను కించపరిచే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారనే ఆరోపణల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. యూట్యూబ్ చానల్స్ పై దాడులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ ఖండించారు. ప్రభుత్వం, సీఎంను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసి మీడియాను లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేయడం, వినకపోతే పోలీసులతో కేసులు పెట్టించడం సహించరానిదన్నారు. జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
