ఫాంహౌస్ కేసు : పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్

ఫాంహౌస్ కేసు : పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో 164 సీఆర్పీసీ నోటీసు కింద పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాను బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తామని నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతిలు ఆఫర్ చేశారంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ముగ్గురు ఒత్తిడి తెచ్చారని, డీలింగ్ లో భాగంగానే వాళ్లు తన ఫామ్ హౌస్ కు వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు ఈ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్, రామచంద్రభారతి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ పేరుతో పోలీసులు టార్చర్ చేస్తున్నారని శ్రీనివాస్ తరుపు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా శ్రీనివాస్ సహా అతడి కుటుంబాన్ని వేధిస్తున్నారని చెప్పారు. బండి సంజయ్, రఘునందన్రావు పేరు చెపితే 5 నిమిషాల్లో విచారణ పూర్తవుతుందని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని..రఘునందన్ రావుతో శ్రీనివాస్కు పరిచయం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు పోలీసులు ఉద్ధేశ్యపూర్వకంగా మల్టిపుల్ కేసులు నమోదు చేస్తున్నారని రామచంద్రభారతి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించగా.. బంజారాహిల్స్లో కేసు నమోదు చేశారని న్యాయవాది జవాబిచ్చారు. బంజారాహిల్స్లోనే కేసు ఎందుకు నమోదు చేశారని న్యాయస్థానం ప్రశ్నించగా..సిట్ కార్యాలయం అక్కడే ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు.