
హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. బాలుడి కిడ్నాప్ కేసులో దంపతులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనవరి 23న పేట్లబురుజు ఆస్పత్రిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. అయితే బాలుడి తల్లిదండ్రులు జనవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించారు. పెద్ద అంబర్ పేట్ లో తలదాచుకున్న నిందితులు వెంకన్న, కవిత దంపతులను అరెస్ట్ చేసి.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు నాగరాజు, కలమ్మ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు వెంకన్న, కవితలకు ముగ్గురు ఆడపిల్లలు వీరికి మగసంతానం లేదు. దీంతో ఇదే విషయం వెంకన్న స్నేహితుడు కిడ్నాపర్ నాగరాజుకు తెలిపాడు. వెంకన్నతో కిడ్నాపర్ నాగరాజు లక్ష రూపాయలు డీల్ కుదుర్చుకున్నాడు.
చార్మినార్ డివిజన్లోని ఓ ప్రభుత్వాసుపత్రి వద్ద మగ పిల్లాన్ని కిడ్నప్ చేసి.. ఆ బాలుడిని వెంకన్న కవిత దంపతులకు ఇచ్చాడు. ఇందుకోసం వెంకన్న కవితల దగ్గర కిడ్నాపర్ నాగరాజు రూ. 60వేలు అడ్వాన్స్ తీసుకున్నాడని చెప్పారు. నాగరాజు కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.