జూబ్లీహిల్స్లో రాజకీయ వేడి.. టీడీపీ, జనసేనతో కలిసి స్కెచ్ వేసిన బీజేపీ

జూబ్లీహిల్స్లో రాజకీయ వేడి.. టీడీపీ, జనసేనతో కలిసి స్కెచ్ వేసిన బీజేపీ
  • ప్రచార పర్వంలో కాంగ్రెస్​ ముందంజ
  • అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు 
  • సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు
  • టీడీపీ, జనసేనతో కలిసి ప్రచారం 
  •  చేసే యోచనతో బీజేపీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్​లో ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ నెల 30న ఓటర్ల తుదిజాబితా వెలువడనుండడం, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉండడంతో  అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. 

ఇప్పటికే కాంగ్రెస్ ముగ్గురు మంత్రులను ఇన్​చార్జీలుగా నియమించగా, బీఆర్ఎస్ ​కూడా ఒక్కో డివిజన్​కు ఇన్​చార్జీలుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను నియమించింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తున్నారు. ఇక మజ్లిస్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. 

కాంగ్రెస్ ముందంజ

జూబ్లీహిల్స్​లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని సీఎం రేవంత్​రెడ్డి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం మంత్రులు వివేక్​ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులను  ఇన్ చార్జీలుగా నియమించారు. వీరంతా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో కార్యకర్తల సమావేశాలు నిర్వహి స్తున్నారు.

 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. 
నీరు, విద్యుత్​, రోడ్లు, డ్రైనేజీ, రేషన్, తదితర సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ​ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 407 బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒక్కో బూత్​కు10 మంది చొప్పున చురుకైన కార్యకర్తలను ఎంపిక చేశారు. 

ఇలా పక్కా ప్లాన్​తో  ముందుకు పోతున్నారు.  అయితే, కాంగ్రెస్ ​తరఫున ఎవరు పోటీలో ఉంటారన్న విషయం ఇంకా ఉత్కంఠను రేపుతోంది. మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్, కాంగ్రెస్​ యూత్​ లీడర్​ నవీన్​యాదవ్​తో పాటు మరికొందరు టికెట్​ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అంజన్ కుమార్ ​యాదవ్, నవీన్​ యాదవ్ పేరిట నియోజకవర్గంలో  ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. 

అంతకు ముందు మాజీ క్రికెటర్​అజారుద్దీన్​ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా.. ఎమ్మెల్సీ ఆఫర్​తో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ​కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. ​బరిలో తాను లేనని,  ​పార్టీ ఏ అభ్యర్థిని నిలిపినా గెలపుకు కృషి చేస్తానని ప్రకటించారు. మాజీ ఎంపీ రంజిత్​రెడ్డి పేరు కూడా ప్రముఖంగా  వినిపిస్తోంది.  

సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్​ ఆశలు

ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​భార్య సునీతను బీఆర్ఎస్​ బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు. కొద్ది రోజుల కింద తెలంగాణ భవన్​లో జరిగిన రహ్మత్​నగర్​ డివిజన్​ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​సునీత అభ్యర్థిత్వంపై పరోక్షంగా సంకేతాలిచ్చారు.

 మాగంటి గోపీనాథ్​మరణంతో ఆయనపై ఉన్న సానుభూతి ఓట్లుగా మారి బీఆర్ఎస్​కే పడతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, మాగంటి గోపీనాథ్​సోదరుడు కూడా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ​నుంచి సస్పెన్షన్​కు గురైన ఎమ్మెల్సీ కవిత ఇక్కడ అభ్యర్థిని నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో దివంగత పీజేఆర్​తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి ఆమెను కలవడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్​ తరఫున మాగంటి ​కుటుంబానికి టికెట్ ఇస్తున్నారని వార్తలు వస్తున్న వేళ..విష్ణు తనకు టికెట్ రాదని నిరుత్సాహానికి గురయ్యాడని, అందుకే కవితను కలిశాడన్న ప్రచారం జరిగింది. అయితే, కొద్దిసేపటికే కేటీఆర్ ​నిర్వహించిన జూబ్లీహిల్స్ ​కార్యకర్తల మీటింగ్​లో పాల్గొని తాను కేటీఆర్​వెంటే ఉంటానని ప్రకటించారు. కవితను కేవలం దసరా ఉత్సవాలకు ఆహ్వానించడానికి మాత్రమే కలిశానని  చెప్పి ఊహాగానాలకు తెరదించారు. 

ఏదైనా భారీ మార్పులు చేర్పులు జరిగితే తప్పా జూబ్లీహిల్స్​లో సునీత అభ్యర్థిత్వాన్ని మార్చే ప్రసక్తి లేదంటున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు ఏడుగురు ముఖ్యనేతలను ఇన్​చార్జీలుగా నియమించారు. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఆయా డివిజన్ల కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల  వ్యూహంపై చర్చిస్తున్నారు.  

బీజేపీ నేతల కసరత్తు

జూబ్లీహిల్స్​ను కైవసం చేసుకునేందుకు బీజేపీ సైతం పావులు కదుపుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్​రెడ్డితో పాటు పార్టీ అధ్యక్షుడు రాంచందర్​రావు నియోజకవర్గంపై ఫోకస్​ పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యలీడర్లతో మానిటరింగ్​కమిటీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్​ ఉండడంతో.. బీజేపీని గెలిపించుకునేందుకు ఆ పార్టీతో పాటు జనసేనను కలుపుకుని ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన లంకెల దీపక్​రెడ్డి ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. 

మహిళను కూడా పోటీకి దింపాలని ఆపార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.  అదే జరిగితే హర్యానా మాజీ గవర్నర్​  బండారు దత్తాత్రేయ తనయ విజయలక్ష్మితో పాటు పార్టీ సీనియర్ లీడర్ ​జూలూరు కీర్తిరెడ్డి, డా.పద్మావీరపనేని పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. గత బుధవారం అకస్మాత్తుగా బీజేపీ సీనియర్​ లీడర్​ మాధవీలత సీన్​లోకి వచ్చారు. తనకు టికెట్​ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పకనే చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్​లో రాజకీయం హీటెక్కింది.  

మజ్లిస్ ​విషయంలో నో క్లారిటీ 

ఈ ఉప ఎన్నికలో మజ్లిస్​ వైఖరిపై స్పష్టత రావడం లేదు. కొద్ది రోజుల క్రితం తాము జూబ్లీహిల్స్​లో పోటీ చేయనున్నట్టు సంకేతాలిచ్చినా ఇప్పుడు స్పందించడం లేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే కాంగ్రెస్​కు మజ్లిస్​మద్దుతు ఇస్తుందని, పోటీ చేయదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్​, మజ్లిస్​పార్టీలు మిత్రులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మజ్లిస్​పోటీ చేయకుండా కాంగ్రెస్​కు మద్దతు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.