యువ ఓటర్లకు ‘లైసెన్స్’​ గాలం

యువ ఓటర్లకు ‘లైసెన్స్’​ గాలం
  • ఖర్చులు భరిస్తూ యూత్​ ను ఆకట్టుకునేందుకు లీడర్ల స్కెచ్​
  • సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లో ఇప్పటికే మొదలు
  • ఇయ్యాల్టి నుంచి ఖమ్మంలో  షురూ
  • డ్రైవింగ్​ లైసెన్స్​ ఫీజు చెల్లించనున్న  పువ్వాడ ఫౌండేషన్​

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో  పొలిటికల్ లీడర్లు ఎప్పటికప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త స్కెచ్​లు వేస్తున్నారు. ఎన్నికల సీజన్​లో ప్రతీసారి యూత్​ను అట్రాక్ట్​ చేసేందుకు క్రికెట్ కిట్లు పంచేవారు.  కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ యువకుల కోసం ఫ్రీ లైసెన్స్​అని కొందరు నేతలు కొత్త స్కీమ్​ తీసుకొచ్చారు. ఇప్పటికే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సక్సెస్​ ఫుల్ గా జరుగుతున్న ఈ  ఫ్రీ లైసెన్స్​ స్కీమ్​ ఇప్పుడు మరిన్ని  జిల్లాలకు విస్తరిస్తున్నది. ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఇయ్యాళ్టి నుంచి 45 రోజుల పాటు ఉచితంగా యువతీ యువకులకు డ్రైవింగ్​ లైసెన్స్​ ఇప్పించనున్నారు.  ఖమ్మం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ క్యాంపు ఆఫీస్​లో దీనికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోనున్నారు. అక్కడ దీని కోసమే ప్రత్యేక మీ సేవా కౌంటర్​ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ కౌంటర్​ద్వారా దరఖాస్తు చేసేందుకు వచ్చిన యువతీ యువకులకు ఫ్రీగా స్లాట్ బుక్​ చేస్తారు. తర్వాతి రోజు ఆర్టీఏ ఆఫీస్​ కు వెళ్లి ఫొటో దిగి, డిజిటల్ సైన్​ చేసి వస్తే సాయంత్రానికి మంత్రి క్యాంపు ఆఫీస్​ లో లెర్నింగ్ లైసెన్స్​అందజేస్తారు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని టెస్ట్ డ్రైవ్​ చేస్తే పూర్తి స్థాయి లైసెన్స్​ తీసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం లైసెన్స్​ ఫీజు మంత్రి అజయ్​కు చెందిన పువ్వాడ ఫౌండేషన్​ ద్వారా చెల్లించనున్నారు. టూవీలర్​, త్రీ వీలర్​, కారు లైసెన్స్ కలిపి​ తీసుకోవాలనుకునే వారికి మొత్తంగా రూ.2,550 లబ్ధి జరగనుంది. 

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో..

రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ స్కీం అమలు చేస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్​ రావు, గజ్వేల్ లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్​ వంటేరు ప్రతాప్​రెడ్డి, దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు, అక్కడ బీఆర్ఎస్​తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఇప్పటికే ఫ్రీ లైసెన్స్​స్కీం​ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కో చోట కనీసం నాలుగైదు వేల మంది దరఖాస్తు చేసుకుంటుండడంతో  దీన్నే మిగిలిన నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ​ నేతలు ఫాలో అవుతున్నారు.  మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి, పర్మినెంట్ లైసెన్స్​తీసుకునే టైంలో ఉచితంగా హెల్మెట్ కూడా అందిస్తామని ఆఫర్​ ప్రకటించారు. ఆధార్​, టెన్త్ మెమో, రెండు ఫొటోలు ఇస్తే చాలు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్​ వస్తుండడంతో యూత్ కూడా ఈ స్కీమ్​ కు అట్రాక్ట్ అవుతున్నారు. 

యూత్ ఉపయోగించుకోవాలి..

ఉచిత డ్రైవింగ్ లైసెన్స్​ మేళాను 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్లు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్​ లేకుండా వాహనాలు నడిపితే, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల కుటుంబాలు రోడ్డున పడ్తాయి. కనీసం ట్రీట్​మెంట్​ చేయించుకునే పరిస్థితి కూడా లేని పేదలు అనేక మంది చనిపోతున్నారు. అలాంటి వారికి ఈ ఫ్రీ మేళా ఉపయోగపడుతుంది. చదువు సర్టిఫికెట్స్ లేకపోయినా ఆధార్ కార్డు, అడ్రస్  ప్రూఫ్ ద్వారా లైసెన్స్ తీసుకోవచ్చు. ‌‌                                                - టి.కిషన్​ రావు, డిస్ట్రిక్ట్​ ట్రాన్స్​ పోర్ట్ ఆఫీసర్