కేసీఆర్.. ఖమ్మం నుంచి  పోటీ చేస్తవా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ 

కేసీఆర్.. ఖమ్మం నుంచి  పోటీ చేస్తవా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలో ముగ్గురిపైనే కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్​తో పాటు తనపైనే కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని తన క్యాంప్ ఆఫీస్​లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానోనన్న దానిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారన్నారు.

తాను కొత్తగూడెం నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి వనమా వెంకటేశ్వర రావును మార్చే చాన్స్​ ఉందన్నారు. రేవంత్, ఈటల రాజేందర్​తో పాటు తాను పోటీ చేసే చోట్ల పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు కేసీఆర్ ఇప్పటినుంచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై కుట్రలు, కుతంత్రాలు చేసే కన్నా కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఉమ్మడి జిల్లా నుంచి కేసీఆర్ నిలబడితే ఆయనపై పోటీకి సిద్ధమన్నారు. కేసీఆర్ ఖమ్మం నుంచి పోటీకి ముందుకు రావాలన్నారు.