ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • ఇకనైనా పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్
  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • కొత్తగూడెంలో  ‘పోడు భరోసా’ ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణను కొల్లగొట్టింది చాలక ఇప్పుడు మహారాష్ట్రను దోచుకునేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్లాన్​ చేస్తున్నదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. హామీలు ఇచ్చి మరిచిపోవడం సీఎంకు అలవాటైందని విమర్శించారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం–ఇల్లెందు  క్రాస్​ రోడ్డు నుంచి కలెక్టరేట్​ వరకు శనివారం మండు టెండలో పోడు సాగుదారులతో కలిసి పొంగులేటి ‘పోడు భరోసా’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల టైమ్ లో పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్​ హమీ ఇచ్చారని, తొమ్మిదేండ్లయినా ఒక్క పట్టా కూడా ఇయ్యలేదని మండిపడ్డారు.

 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు రైతుల వద్దకే వెళ్లి కుర్చీ వేసుకొని కూసొని  పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పిన కేసీఆర్​ మాటలకు నాలుగున్నరేండ్లైనా అతీగతీ లేదని, మాయ మాటలతో గిరిజనులను ఎన్ని సార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో పోడు భూములకు పట్టాలిస్తానని మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు కేసీఆర్​ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలన్నారు. తాతల కాలం నుంచి పోడుసాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులందరికీ పట్టాలు ఇవ్వాలని, వారిపై మోపిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్   చేశారు. 

ర్యాలీలో ఉద్రిక్తత

జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాయకులు తెల్లం వెంకట్రావ్​, జారే ఆదినారాయణలతో పాటు వేలాది మంది పోడు సాగుదారులతో పొంగులేటి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ కొంత ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్​లో వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తుండగా నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు వాగ్వాదం జరిగింది. బారికేడ్లను దాటుకుంటూ కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున పోడు సాగుదారులు వస్తుండడంతో పోలీసులు కలెక్టరేట్​ గేట్లు బంద్  చేశారు. అనంతరం పొంగులేటి ఆధ్వర్యంలో నాయకులు అదనపు కలెక్టర్​ కు వినతిపత్రం ఇచ్చారు.