తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేల కోట్ల స్కామ్:మాజీ ఎంపీ పొన్నం

 తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేల కోట్ల స్కామ్:మాజీ ఎంపీ పొన్నం

హైదరాబాద్​, వెలుగు: తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేసి వాటిని సింగరేణికి అప్పజెప్పాలని సీనియర్​ కాంగ్రెస్​ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. సోమవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిచెర్ల గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్​ కంపెనీకి కట్టబెట్టారని, ఇందులో కేసీఆర్​కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా 30 ఏండ్లపాటు ఈ కంపెనీకి అప్పజెప్పారని, ఇది వేల కోట్ల స్కామ్​అని ఆరోపించారు.

రాష్ట్రంలో 4 బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని టీఆర్ఎస్​ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజానికి సింగరేణిలో ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలన్నారు. తాడిచెర్ల గనుల కేటాయింపును రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందన్నారు. వెంటనే ఆ పని చేయాలని కోరారు. ఒకవేళ బీజేపీ ఈ అంశంపై స్పందించకపోతే  రెండు పార్టీలు ఒకటేనని మరో సారి రుజువవుతుందన్నారు. తాడిచెర్ల బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని తెలుస్తోందని, దీనిపై సీబీఐ, ఈడీ, బొగ్గు శాఖకు లేఖల ద్వారా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.