
సమాజంలోని అసమానతలు రూపుమాపి అట్టడుగు వర్గాల వారికీ విద్యనందించిన మహనీయుడు మహాత్మ జ్యోతీరావు పూలే అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో లక్ష్యసాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల వారికి జ్యోతీరావు పూలే అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. తొలి సాంఘిక విప్లవకారుడు జ్యోతీరావు పూలే అని ఈటల అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో పుట్టి వివిధ రంగాల్లో సేవ చేస్తూ ప్రతిభ కనబరిచిన వాళ్లకు ఏటా అవార్డులను ఇవ్వడం సంతోషమన్నారు. మనిషికి కావాల్సింది విద్య అని, ఆ అవసరాన్ని గుర్తించి మొట్టమొదటిసారి పాఠశాలలను ప్రారంభించి కోట్లాది మందికి ఆయన ఆదర్శమయ్యారని అన్నారు. ఆయనే స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో 250కి పైగా బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. అంతేగాకుండా బలహీన వర్గాల వారికి అత్యున్నతమైన విద్యను అందించేందుకు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరిట 20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వందల ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలు ఎంతో గోసపడ్డారని, వృత్తులు లేక ఉపాధి కరువై ఎన్నో ఇబ్బందులు పడ్డారని శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనకబాటుతనాన్ని పారదోలి బీసీల భవిష్యత్ను చక్కదిద్దే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మార్కెట్ కమిటీలో తొలిసారిగా బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ట్యాంక్బండ్పై పూలే విగ్రహం పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. . జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, పాటల రచయిత అశోక్ తేజ, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, మాజీ అడ్వొకేట్ జనరల్ కేజీ కృష్ణమూర్తి, డాక్టర్ విజయ భాస్కర్, సుధగాని హరీశ్ శంకర్, గడీల శ్రీకాంత్లకు పూలే అవార్డులను అందజేశారు.