
దేశవ్యాప్తంగా జనాభా గణన, కులగణనకు డేట్ ఫిక్స్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాలపై జరిగిన క్యాబినెట్ కమిటీ 2025 ఏప్రిల్ 30న ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఏప్రిల్ 30 జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో జనాభా లెక్కలు, కులగణనకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ భేటీలో జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చడానికి ఆమోదం తెలిపిందని అశ్వీని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక విలువలు, ప్రజా ప్రయోజనాల పట్ల ప్రభుత్వం నిబద్ధతను కలిగి ఉందని వైష్ణవ్ తెలిపారు.
మార్చి 1, 2027 నుంచి జాతీయ జనాభా గణన, కుల గణన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భారీస్థాయి జనాభా గణనకు సన్నాహాలు షెడ్యూల్ ప్రకటించింది కేంద్రం. చాలా కాలంగా వాయిదా పడుతున్న జనాభాగణన డిమాండ్ అమలులో ఇదొక కీలక ముందడుగు.
జనాభా, కుల గణన రెండింటికీ కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ను నిర్ణయించింది..ఈ ప్రక్రియ మార్చి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ,ఉత్తరాఖండ్లలో ఈ ప్రక్రియ అక్టోబర్ 2026 నుంచి ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా కుల గణన డిమాండ్ను కాంగ్రెస్, ఇండియా బ్లాక్ ,వివిధ ప్రాంతీయ పార్టీలు పదే పదే లేవనెత్తుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పాలిత కర్ణాటక తన సొంత కుల సర్వేను నిర్వహించింది. అయితే ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వొక్కలిగ ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
జాతీయ జనాభా రిజిస్టర్ (NPR)ను అప్డేట్ సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. 2011లో జరిగిన చివరి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లుగా నమోదైంది. ఆ లెక్కల్లో 17.7 శాతం వృద్ధి రేటును చూపించింది.