రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ప్రెస్మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు .
ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ ‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు నటించారు. ఈ సినిమాకు పాలిటిక్స్కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్గా చేసిన సినిమా ఇది. వంద చిత్రాలకు కథ స్క్రీన్ప్లే రాసిన అనుభవం నాకుంది. నా కెరీర్లో ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీగా పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నా’ అని అన్నారు. అరుణ అనే పవర్ఫుల్ ఉమెన్గా ఈ చిత్రంలో కనిపిస్తానని హిందోళ చక్రవర్తి చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
