నంది అవార్డు కాదు కమ్మ అవార్డు.. అందుకే రిటర్న్ ఇచ్చేశాను : పోసాని కృష్ణమురళీ

నంది అవార్డు కాదు కమ్మ అవార్డు.. అందుకే రిటర్న్ ఇచ్చేశాను : పోసాని  కృష్ణమురళీ

సినీ నటుడు పోసాని కృష్ణమురళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు నందీ అవార్డు రావడంపై స్పందించిన ఆయన దానిని తిరస్కరించడానికి గల కారణాలను తెలిపాడు. టెంపర్ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు నంది అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉంది. గతంలో ఈ రెండు ప్రాంతాలకు ఈ రెండు, ఆ రెండు ప్రాంతానికి ఆ రెండు అవార్డులను ఇవ్వాలని అనుకునేవారు. దీనిపై నేను అప్పుడే ప్రశ్నించాను. ఎదురించాను. అందుకే పోసానికి నంది ఇవ్వకూడదు అనుకున్నారు. కొంత మంది రైటర్ లు, ఆర్టిస్టులు నందులను పంచుకునేవారు. నందీ అవార్డులు పంచుకునే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు నష్టపోయారు.అప్పట్లో ఓ సారి నంది అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు. నా కర్మగాలి నాకు టెంపర్ మూవీకి నంది అవార్డు వచ్చింది.తప్పదు అన్నట్టుగా ఇచ్చారు. కానీ, నేను నంది ని తిరస్కరించాను. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేశాను. ఈ అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. పాత వాళ్లకు ఇవ్వాలా? లేదా కొత్త వారితో కొత్తగా స్టార్ట్ చేయాలా? అనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’అంటూ కృష్ణమురళీ పేర్కొన్నాడు. 

ఏపీ ప్రభుత్వం సొంతంగా ప్రారంభిస్తోన్న ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ కు పోసాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం నిర్వహించిన కార్యక్రమంలో నటుడు అలీతో పాటుగా ఆయన పాల్గొన్నారు. విడుదలైన రోజే కొత్త సినిమాలను ఈ టీవీలో టెలికాస్ట్ చేయనున్నామన్నారు. ఒక్కో సినిమాకు రూ.99 ఛార్జ్ చేస్తామని.. 24 గంటల లోపు ఎన్ని సార్లైనా సినిమాను చూడవచ్చన్నారు. ‘‘ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ ఛానెల్ అందుబాటులో ఉంది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక్కడ సినిమాలకు 90 శాతం సబ్సిడీ ఇవ్వబోతున్నాం. చిన్న సినిమాలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. వారికి అవసరమై ఆతిథ్యాన్ని కూడా అందంచనున్నాం’’ అని పోసాని తెలిపారు.