టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై పరువు నష్ట దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై పరువు నష్టం దావా వేయడంపై పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. తనను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పోసాని. చంద్రబాబు అక్రమాలను బయటపెట్టినందకే తనపై కక్ష పెంచుకున్నారని ఆయన చంద్రబాబు, లోకేశ్ లపై విరుచకుపడ్డారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారని పోసారి కృష్ణ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను చచ్చిపోతే లోకేష్దే బాధ్యత అని.. ఇదే తన మరణ వాంగ్మూలం అని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కంటే ఎక్కువ క్రెడబులిటీ ఉన్నవాడినని.. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నానని తెలిపారు. లోకేష్ తనపై నాలుగు కోట్ల పరువు నష్టం దావా వేశాడని.. అసలు లోకేష్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. కంతేరులో లోకేష్ భూమి కొన్నాడని అనడం పరువు నష్టం అయ్యిందట అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్ పరువు నష్టం దావా వేస్తే.. కనీసం 20 ఏళ్లు జైల్లో ఉంటాడని అన్నారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
లోకేశ్ అమ్మ, భార్య ఆస్తులు లోకేశ్ వి కావా?. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే నాపై కక్ష గట్టారని పోసాని అన్నారు. తనపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ... జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటానని పోసాని స్పష్టం చేశారు. తాను చావుకు భయపడని వ్యక్తిని అంటూ పోసాని లోకేశ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.