- నేటితో ముగియనున్న కస్టోడియల్ ఇంటరాగేషన్
- రేపు సుప్రీంకు స్టేటస్ రిపోర్ట్ అందజేత
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదు. సిట్ అడిగిన అనేక ప్రశ్నలకు ‘తెలియదు.. చెప్పలేను’ అని ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వల్ల తను ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పినట్టు సమాచారం. నిబంధనల ప్రకారమే ట్యాపింగ్ జరిగిందని, అన్ని విషయాలు హోంశాఖ సహా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు తెలుసునని స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు ప్రభాకర్ రావు వినియోగించిన మూడు సెల్ఫోన్లలో ఒక ఫోన్కు సంబంధించి క్లౌడ్ పాస్వర్డ్ను సిట్ అధికారులు ఇప్పటికీ రాబట్టలేకపోయారని సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న ప్రభాకర్ రావు సిట్ఎదుట సరెండర్ అయ్యారు. ఆనాటి నుంచి ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇది గురువారంతో ముగియనుంది. విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సిట్ అధికారులు శుక్రవారం సుంప్రీంకోర్టుకు అందించనున్నారు. అదేరోజు విచారణ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, వారం రోజుల కస్టోడియల్ విచారణలో ప్రధానంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ గురించి ప్రభాకర్ రావును ఆరా తీసినట్టు సమాచారం. ఆపరేషన్ టార్గెట్స్ ఏర్పాటుకు ఎవరు అనుమతి ఇచ్చారు? దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన ఎవరు చేశారనే కోణంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్ నుంచి.. ఎలక్షన్స్ ముగిసే వరకు (2024 మార్చి) ప్రభాకర్ రావు కాల్ డేటాలో గుర్తించిన ఫోన్ నంబర్ల ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం.
