అమరావతి: ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. ఓ కేసు విషయంలో నిందితుడు బత్తుల ప్రభాకర్ను హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకెళ్లారు అక్కడి పోలీసులు. ఏపీలోనూ బత్తుల ప్రభాకర్పై అనేక కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలు నుంచి సోమవారం (సెప్టెంబర్ 22) ఉదయం కోర్టులో హాజరు పరిచేందుకు ప్రభాకర్ను విజయవాడకు తీసుకెళ్లారు పోలీసులు.
కోర్టులో ప్రొడ్యూస్ చేసి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించే క్రమంలో ఓ దాబా వద్ద కారు ఆపారు పోలీసులు. ఇదే అదునుగా భావించిన ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ప్రభాకర్ పారిపోవడంతో షాక్కు గురైన పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో బత్తుల ప్రభాకర్ దగ్గర 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నాడు. ఏపీలోనూ ప్రభాకర్ పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇందులో భాగంగానే ప్రభాకర్ ను పీటీ వారెంట్ మీద హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు ఏపీ పోలీసులు.
