
ప్రభాస్ అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం.. ‘ఆదిపురుష్’. భారీ అంచనాల నడుమ చిత్రం 2023 జూన్ 16న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు (U) సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు రివ్యూ ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. అంటే 179 నిమిషాలు అన్నమాట.
ఆదిపురుష్ మొత్తం ఇండియాలో 6 వేల 200 ప్లస్ స్క్రీన్లలో విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్లు జూన్ 10 శనివారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. PVR, Inox , Cinepolis లలో హిందీ వర్షెన్ కోసం ఏకంగా 1.13 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. హిందీ వర్షెన్ లో ఒక చిత్రానికి అత్యధిక అడ్వాన్స్లలో బుకైన చిత్రాలలో ఒకటిగా ఆదిపురుష్ నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్ లో ఆర్ఆర్ఆర్(1.05 లక్షల టిక్కెట్లు) కంటే ఆదిపురుష్ ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయాయి. హిందీలో 25 నుంచి 30 కోట్ల రేంజ్లో చాలా మంచి ఓపెనింగ్స్ సాధించాలని ఆదిపురుష్ టీమ్ భావిస్తోంది.
రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్.. రాముడిగా, హీరోయిన్ కృతిసనన్.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్గా సైఫ్ అలీఖాన్, హనుమంతుడిగా సన్నీసింగ్ నటించారు. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టుగా ఇప్పటికే టీమ్ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టుగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇప్పటికే తెలిపారు.