ఆగస్టు 27న ఢిల్లీలో ప్రగతి మీటింగ్

ఆగస్టు 27న ఢిల్లీలో ప్రగతి మీటింగ్
  • పోలవరం అంశంలో చర్చపై అనుమానాలు!

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ప్రగతి మీటింగ్​నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వివిధ రాష్ట్రాలతో వివిధ ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఎప్పట్లాగే పోలవరం ప్రాజెక్టును తొలి ఎజెండాగా మీటింగ్​లో చర్చించనున్నారు. అయితే, గతంలో మే 28న ఒకసారి, జూన్​ 25న మరోసారి ప్రగతి మీటింగ్​ను నిర్వహించినా పోలవరం అంశాన్ని ఎత్తేశారు. ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేశారు. 

పోలవరం ప్రాజెక్టుతో మన రాష్ట్రంలో ముంపు సమస్య ఉంటుందని, జాయింట్​ సర్వే చేయించాలని రాష్ట్ర సర్కారు ఎప్పట్నుంచో డిమాండ్​ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధానికి ఆ విషయాన్ని వివరించాలని భావించింది. కానీ, రెండు సార్లు మీటింగ్​ నుంచి పోలవరం ఎజెండా ఎత్తేయడంతో ఆ అవకాశం రాకుండాపోయింది. 

మరి, ఇప్పుడైనా మీటింగ్​లో పోలవరం అంశాన్ని చర్చిస్తారా.. ఎప్పట్లాగే ఎత్తేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మీటింగ్​లో హైదరాబాద్​ నాగ్​పూర్​ ఇండస్ట్రియల్​ కారిడార్​తో పాటు మరో మూడు అంశాలపైనా చర్చించనున్నట్టు కేంద్రం ఇటీవలే రాష్ట్ర సర్కారుకు సమాచారమిచ్చింది. కాగా, వచ్చే నెల 3న ప్రాజెక్ట్​ మానిటరింగ్​ గ్రూప్​ (పీఎంజీ) ప్రాజెక్టులపైనా కేంద్ర కేబినెట్​ చర్చించనుంది. రాష్ట్రపతిభవన్​లోని కేబినెట్​ సెక్రటేరియెట్​ కాన్ఫరెన్స్​ రూమ్​లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.