ఓస్లో: ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ముగిసిన ఆఖరిదైన పదో రౌండ్ క్లాసికల్ గేమ్లో ప్రజ్ఞానంద 45 ఎత్తుల వద్ద విన్సెంట్ కీమర్ (జర్మనీ)పై గెలిచాడు. ఈ విజయంతో మూడు పాయింట్లు నెగ్గిన ఇండియన్ ప్లేయర్ మొత్తం 18 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచి ట్రోఫీని సాధించాడు. ఫలితంగా ఈ ట్రోఫీని నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.
2013లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డి. గుకేష్ వంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డును ఈ 20 ఏళ్ల చెన్నై కుర్రాడు సాధించడం విశేషం. టోర్నీ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ప్రజ్ఞానంద.. రెండో సగంలో వరుసగా నాలుగు విజయాలతో చెలరేగిపోయాడు.
ఈ టోర్నీలో ఏడుసార్లు విజేతగా నిలిచిన వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను రెండుసార్లు ఓడించడం మరో విశేషం. అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానందపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఇక చివరి రౌండ్లో గుకేశ్.. కార్ల్సన్ చేతిలో ఓడగా, విమెన్స్లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (9), దివ్య దేశ్ముఖ్ (10) కూడా నిరాశపర్చారు.
