కేసీఆర్ ఇచ్చే పైసలు తీస్కొని బీజేపీకి ఓటేయున్రి

కేసీఆర్ ఇచ్చే పైసలు తీస్కొని బీజేపీకి ఓటేయున్రి

ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. పాలకుర్తి చౌరస్తాలో రోడ్ షో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని ఆరోపించారు. తాను వస్తున్నాననే పోలీసులు షాపులు బంద్ చేయించారని విమర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. తమ లిస్ట్ లో వరంగల్ సీపీ పేరు రాసుకున్నామని అన్నారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ సర్కారు చేయని పక్షంలో మెడలు వంచి జరిపిస్తామని చెప్పారు. కేటీఆర్ డీజే టిల్లు అని, ముఖ్యమంత్రిని పాస్ పోర్టు బ్రోకర్ అని విమర్శించిన ఆయన ఖమ్మం హాస్పిటల్ లో కేసీఆర్ మందు తాగుతూ దొంగదీక్ష చేశారని అన్నారు. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని బండి హామీ ఇచ్చారు. హుజూరాబాద్ లో ఓటుకు పదివేలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో రూ.30 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకొని బీజేపీకి ఓటేసి గడీల పా లన అంతం చేయాలని పిలుపునిచ్చారు.