నిజామాబాద్​లో ప్రజాపాలన గ్రామసభలు షురూ

నిజామాబాద్​లో ప్రజాపాలన గ్రామసభలు షురూ
  • అభయహస్తం అప్లికేషన్ల స్వీకరణ
  • పొద్దటి నుంచే తరలొచ్చిన జనం
  • తొలిరోజు నిజామాబాద్​లో 11,848,
  •  కామారెడ్డిలో 21,914 దరఖాస్తులు
  • విజిట్ ​చేసిన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్​ హరిత

నిజామాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలకు తొలిరోజు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది.  గురువారం జిల్లాలోని 112 విలేజ్​లు, ఆయా మున్సిపాలిటీల్లోని 146 వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించారు. పొద్దున 8 గంటల నుంచే జనాలు క్యూ కట్టి దరఖాస్తులు అందించారు. ఫస్ట్ ​డే జిల్లాలో 11,848  దరఖాస్తులు వచ్చాయి. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు. పొద్దున 8 నుంచి 12 వరకు, లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో అప్లికేషన్లు స్వీకరించారు.

దరఖాస్తుల పంపిణీ

ప్రజా పాలన జరిగే గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిల్లోని వార్డులు/డివిజన్ల సమాచారాన్ని ఆఫీసర్లు ముందుగానే ప్రజలందరికీ  తెలిసేలా చాటింపులు వేయించారు. దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయించారు. ప్రజలు ఆరు గ్యారంటీలతో కూడిన అప్లికేషన్​లో తమ వివరాలు పొందుపరిచి, రశీదులు తీసుకున్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత కోసం ఆర్జీలే కాకుండా రేషన్​కార్డు, ఇంటి జాగాల కోసం విడిగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు.ఫారాలు నింపడానికి అంగన్వాడీ టీచర్లు, విద్యావంతులు, యువత, వాలంటీర్లు హెల్ప్ చేశారు.   

ఆఫీసర్ల పర్యవేక్షణ

ప్రజాపాలన పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ హరిత వచ్చారు. ఇందల్వాయి మండలం రంజిత్​ నాయక్​ తండా, డిచ్​పల్లిలోని వెస్లీనగర్ తండా, నగర శివారులోని మాధవ్​నగర్ లను ఆమె విజిట్ చేశారు. దరఖాస్తుదారులతో మాట్లాడి ఫీడ్​బ్యాక్​ తీసుకున్నారు. కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు నిజామాబాద్, మోపాల్ మండలాల్లో పర్యటించి వసతులు పరిశీలించారు. అడినల్​కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు.​ చేశారు. బోధన్, రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్​పాల్ సూర్యనారాయణ తమ సెగ్మెంట్ లలో పాల్గొన్నారు. శుక్రవారం జిల్లాలోని 101 విలేజ్​లలో ప్రజాపాలన నిర్వహించనున్నారు.  

కామారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా గ్రామసభల నిర్వహణ  గురువారం షురూ అయ్యింది. కామారెడ్డి జిల్లాలో ఫస్ట్​ డే 54 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీల్లో గ్రామసభలు నిర్వహించారు. అభయహస్తం స్కీమ్​ల కోసం ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. మొదటి రోజు జిల్లాలో 21,914 అప్లికేషన్లు వస్తే ఇందులో గ్రామాల్లో 17,001, 3 మున్సిపాలిటీల్లోని 80 వార్డుల్లో 4,913 అప్లికేషన్లు వచ్చాయి. సభలను కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్, అడిషనల్​ కలెక్టర్​ మనూచౌదరి, స్టేట్​అబ్జర్వర్ హరిత పరిశీలించారు. నిజాంసాగర్​ మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో జుక్కల్​ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్​రావు హాజరయ్యారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు,  ప్రత్యేక ఆఫీసర్లు, స్థానిక యంత్రాంగం పాల్గొన్నారు. 

పొద్దటి నుంచే..

స్వీమ్​ల కోసం అప్లికేషన్లు ఇవ్వడానికి గ్రామాల్లో  ప్రజలు పొద్దటి నుంచే తరలివచ్చారు. గ్రామ పంచాయతీల వద్ద టెంట్లు ఏర్పాటు  చేశారు.  అప్లికేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. పంచాయతీ సెక్రెటరీలు, అంగన్​వాడీ టీచర్లు అప్లికేషన్ ​ఫారాలు నింపి ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.

అప్లికేషన్ ​ఫామ్​లు లేక ఇబ్బందులు


పలు గ్రామాలకు అప్లికేషన్ ​ఫారాలు తక్కువగా వచ్చాయి. ఫార్మెట్ ​ప్రకారం అప్లికేషన్లు ప్రింట్ చేసి సప్లయ్​ చేశారు. ఫస్ట్​డే పలు చోట్ల ఫామ్స్ ​సరిపోలేదు. బిచ్కుందలో ప్రింటెండ్​ అప్లికేషన్లు ఇవ్వాలని కోరుతూ స్థానికులు కొందరు పంచాయతీ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. ఇంకా అప్లికేషన్లు వస్తాయని, ప్రతి ఒకరికి ఫారాలు ఇస్తామని, జనవరి 6 వరకు స్వీకరిస్తామని ఆఫీసర్లు నచ్చజెప్పారు.

అందరికీ సంక్షేమ ఫలాలు

ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రజా పాలన చేపట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ ​వీ పాటిల్ ​పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట మండలాల్లోని గ్రామాల్లో ఆయన స్టేట్​ అబ్జర్వర్ ​హరిత, అడిషనల్​కలెక్టర్ ​మనూ చౌదరితో కలిసి గ్రామసభల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. అభయ హస్తం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అన్నీ పథకాలకు ఒకటే అప్లికేషన్​ ఇస్తే సరిపోతుందన్నారు.