పాట్నా: బీహార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రజల అభివృద్ధి కోసం తన శక్తినంతా ధార పోస్తానని... ఎట్టి పరిస్థితుల్లో తన ఈ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయబోనని బీహార్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నటు పీకే చెప్పారు. ఇక నుంచి తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను ఏమాత్రం కానని, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోడానికి త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు ఏడాదిపాటు సాగే ఈ యాత్రలో రాష్ట్రంలోని ప్రతి తలుపు తడతానని పేర్కొన్నారు. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తానని... గతంలో చేసిన తప్పును మళ్లీ చేయబోనని నితీష్ కుమార్ కు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పని చేసిన విషయం గురించి ఇండైరెక్టుగా చెప్పారు. ఇక నుంచి ఐ ప్యాక్ సంస్థకు తనకు ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ప్రకటించారు. ఇదిలా ఉండగా... కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పీకే పని చేయబోతున్నారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ఇటీవల బాగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ తో తాను కలిసి పని చేద్దామనుకున్న విషయం వాస్తవమేనని, కొన్ని కారణాల రీత్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పీకే అనంతరం ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం...