
- సమ్మక్క, సారలమ్మకు చీరె, సారె, ఒడిబియ్యం సమర్పించుకున్న భక్తులు
- బంగారంతో నిండిన గద్దెలు, నేడు వన ప్రవేశం
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తవ్వగానే మేడారం మహాజాతర అధికారికంగా పూర్తవుతుంది. బుధవారం సారలమ్మ రాకతో మొదలైన మహాజాతర అమ్మల వన ప్రవేశంతో ముగుస్తుంది.
మేడారం ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వన దేవతలంతా గద్దెలపై కొలువు దీరడంతో మేడారం జనసంద్రమైంది. మహాజాతరలో మూడో రోజు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి.. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, బంగారం, చీర, సారె, ఒడిబియ్యం సమర్పించారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క గద్దెలపైకి చేరడంతో శుక్రవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, కుటుంబసభ్యులతో గద్దెల చెంతకు క్యూ కట్టారు. భక్తులు సమర్పించిన బంగారం (బెల్లం), ఇతర కానుకలతో గద్దెలన్నీ నిండిపోయాయి.
సాధారణ క్యూ లైన్లలో తోపులాటలు
గద్దెల వద్ద సాధారణ భక్తుల కోసం రెండు క్యూలైన్లు, వీఐపీ, వీవీఐపీల కోసం ఒక్కోటి చొప్పున క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో దర్శనానికి 5 గంటలకు పైగా టైం పట్టింది. దీంతో పిల్లలతో వచ్చిన భక్తులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోలేక చాలామంది అమ్మవార్లను దర్శనం చేసుకోకుండానే నిరాశగా వెనుదిరిగారు.
కోటి మందికి పైగా భక్తుల రాక
గత మూడు రోజులలో కోటి మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చే రోజు 30 లక్షల మంది, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చిన గురువారం 40 లక్షల మంది, శుక్రవారం 30 లక్షల మంది భక్తులు మేడారం వచ్చారని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రుల రాక
శుక్రవారం అమ్మవార్లను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయమంత్రి రేణుకాసింగ్, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తదితరులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఏర్పాటుచేసిన సదుపాయాలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నామని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
శనివారం అమ్మవార్ల దర్శనానికి గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు.
తోపులాటలో ఇద్దరు భక్తుల మృతి
గురువారం రాత్రి సమ్మక్క తల్లిని గద్దె మీదికి చేర్చిన తర్వాత ఒకేసారి క్యూలైన్లలో భక్తులను విడిచిపెట్టడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న ఇద్దరు భక్తులు హైదరాబాద్కు చెందిన రాజు గోపాల్(65), గోదావరి ఖనికి చెందిన భీమనేని రాజేందర్(50) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని మేడారంలోని ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్పొందుతూ మృతిచెందారు. ఆ ఇద్దరూ గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ మేడారం పర్యటన రద్దు
హైదరాబాద్, వెలగు: సీఎం కేసీఆర్ మేడారం పర్యటన రద్దయింది. శుక్రవారం ఆయన మహాజాతరకు హాజరై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారని మొదట సీఎంవో ప్రకటించినా.. వెళ్లలేదు. వాతావరణం అనుకూలించకే కేసీఆర్ మేడారం పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ అధికారుల ద్వారా తెలిసింది. రోడ్డు మార్గంలో వెళ్లాలని అనుకున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో మేడారం ప్రయాణాన్ని కేసీఆర్ రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.