హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న రెండు పీఆర్సీలు చెల్లిస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులు ఆందోళన చెందొద్దన్నారు. బుధవారం ఆర్టీసీ టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, కమలాకర్ గౌడ్, నరేందర్ తో పాటు సుమారు 20 మంది నేతలు మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లను కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ, కార్మికులు బాగుండాలనే విలీనం చేశామని మంత్రులు తెలిపారు.
అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని అసెంబ్లీ సమావేశాల్లో విలీనం బిల్లు ప్రవేశపెడుతున్నామని మంత్రి హరీశ్రావు చెప్పారని థామస్ రెడ్డి తెలిపారు. విలీనం టైమ్ లో ఏపీ ఆర్టీసీలో జరిగిన ఇబ్బందులు ఇక్కడ జరగవని హామీ ఇచ్చారన్నారు. విలీనం తరువాత కార్మికులకు ఉద్యోగ భద్రత వస్తుందన్నారు. అధికారుల కమిటీలో యూనియన్ నేతలకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరగా, సీఎంతో మాట్లాడి అవకాశం కల్పిస్తానని హరీశ్రావు తెలిపారని థామస్ రెడ్డి వెల్లడించారు.