ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన జాదవ్ జయశ్రీ 8 నెలల గర్భిణి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108లో ఆసుపత్రికి తరలించాలని భావించారు. ఇచ్చోడ ఆసుపత్రి దగ్గరున్న వాగు పొంగి.. వరద ఉధృతికి వంతెన తెగి రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో 108 అంబులెన్స్ గ్రామానికి వెళ్లలేకపోయింది. దాంతో జయశ్రీని జల్దా నుంచి గేర్జం, జామిడి గ్రామాల మీదుగా ఇచ్చోడ బైపాస్ రోడ్డు వరకు ఆటోలో తరలించారు. అక్కడ అండర్బ్రిడ్జి నుంచి చేతుల మీద మోస్తూ బైపాస్ రోడ్డు పైకి ఎక్కించారు. అక్కడ నుంచి అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదటి కాన్పులో ముందస్తు నొప్పులు వస్తాయని, కాన్పు కోసం ఇంకా టైమ్ ఉందని ఆమెను పరీక్షించిన డాక్టర్ సాగర్ చెప్పారు. ఒక రోజు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు.
