న్యూఢిల్లీ: సోలార్ సెల్స్, మాడ్యుల్స్ను తయారు చేసే ప్రీమియర్ ఎనర్జీస్, సోలార్ ప్యానెల్స్ తయారీకి అవసరమయ్యే ఇంగోట్, వేఫర్స్ను కూడా తయారు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రానున్న మూడేళ్లలో (2028 నాటికి) రూ.6 వేల కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రుస్తాగి ప్రకారం, కంపెనీ మొత్తం రూ.12,500 కోట్లతో పెట్టుబడి ప్లాన్ను రెడీ చేసింది. ఇందులో భాగంగా సోలార్ సెల్, మాడ్యూల్ సామర్థ్యాన్ని 10.6 గిగావాట్లకు పైగా పెంచడంతో పాటు ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ఫార్మర్ల రంగాల్లోకి కూడా ప్రవేశిస్తోంది.
ఈ కొత్త ప్లాంట్ను తిరుపతికి సమీపంలోని నాయుడుపేటలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 10 గిగావాట్ల ఇంగోట్, 10 గిగావాట్ల వేఫర్ సామర్థ్యంతో ప్లాంట్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతంప్రీమియర్ ఎనర్జీస్కు తెలంగాణలోని హైదరాబాద్ పరిసరాల్లో ఏడాదికి 3.6 గిగావాట్ల సెల్స్, 11.1 గిగావాట్ల మాడ్యూల్స్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
