న్యూఢిల్లీ: మరో మహమ్మారి కోసం సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాధినేతలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఏ) సమావేశాలు వర్చువల్గా జరిగాయి. ఈ సందర్భంగా కరోనాతోపాటు తదుపరి పరిస్థితులపై డబ్ల్యూహెచ్వో ఇంటర్నేషనల్ బాడీ కొన్ని విషయాలను పేర్కొంది.
‘మనం కచ్చితంగా మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలి. గత ఏడాది కాలంలో పలు దేశాలు తమ ఎమర్జెన్సీ సేవలు, మౌలిక సేవలను సంసిద్ధం చేయడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్నాయి. ఇది ప్రపంచ విపత్తు. చాలా దేశాలు, నగరాలు కరోనా వ్యాప్తిని బాగా కంట్రోల్ చేశాయి. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతోపాటు మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని కరోనా మహమ్మారి మనకు గుర్తు చేసింది. కరోనా వల్ల దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఆరోగ్యం ఎంతటి బలమైన పునాదో తెలిసొచ్చింది’ అని డబ్లూహెచ్వో పేర్కొంది. క్లిష్టమైన ఆరోగ్య లక్ష్యాలపై దేశాలు వెనక్కి తగ్గకూడదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.