
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తున్నారు. ఇటీవల ఉగ్రదాడులు, పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుండటంతో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకున్నది.
కేంద్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన వంతెనపై నుంచి ప్రయాణించే.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు కాశ్మీర్ను జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేయనున్నది. రెండు రైళ్లు ఒకటి శ్రీనగర్ నుంచి కాట్రా, మరొకటి కాట్రా నుంచి శ్రీనగర్ వైపు నడపాలని అధికారులు యోచిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఈ పర్యటనలో భాగంగా మోదీ.. కేంద్ర సర్కారు నిర్మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెనను ప్రారంభించి, ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ఇది 272 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఉధంపూర్–-శ్రీనగర్–-బారాముల్లా రైల్వే లింక్ లో ఇది కీలక భాగం. కశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ రైలు లింక్ 1997లో ప్రారంభమైనప్పటికి భౌగోళిక, వాతావరణ సవాళ్ల కారణంగా ఆలస్యమైంది.
వంతెనను ప్రారంభించిన తర్వాత మోదీ.. రైలులో కత్రాకు ప్రయాణించి, మార్గమధ్యలో అంజి ఖాడ్ పై దేశపు మొట్టమొదటి కేబుల్- స్టేయిడ్ వంతెనను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు సహా రైల్వే ఇంజనీర్లతో ప్రధాని సంభాషిస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ 2 ప్రాజెక్టులకు ప్రధాని జాతికి అంకితం చేసి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉగ్రవాదం అణచివేతపై ప్రధాని కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.