అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: ప్రధాని మోడీ

అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: ప్రధాని మోడీ

అమరావతి: ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి సాకారం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. అమరావతి ఒక పుణ్య భూమి అని.. నేను ఈ పుణ్యభూమిపై నిలబడి మీ అందరితో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. అమరావతి అంటే సాంప్రదాయం, పురోగతి అని.. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అమరావతి అంటే కేవలం ఒక నగరమే కాదని.. ఒక శక్తి అని అభివర్ణించారు. ఇవాళ దాదాపు రూ.60 వేల కోట్ల పనులకు శంఖుస్థాపనలు చేశా.. అయితే ఇవి కేవలం శంఖుస్థాపనలే కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‎కు బలమైన పునాదులని పేర్కొన్నారు. 

శుక్రవారం (మే 2) ఆంధ్రప్రదేశ్‎లోని వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణ పనులను మోడీ ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. మోడీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్‌ పనులు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ.. ఏఐ, ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని రంగాల్లో అమరావతి కీలకంగా మారబోతుందని అన్నారు. అమరావతి ప్రతి వ్యక్తి కలల నిర్మాణమని.. త్వరలోనే వారి స్వప్నం సాకారం కాబోతుందని చెప్పారు.

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమని.. ఆయన ఐటీ విజన్ ను నేను అప్పుడు గుజరాత్ సీఎంగా ఉండి పరిశీలించానని తెలిపారు. నాణ్యమైన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ప్రశంసించారు. 2015లో అమరావతి నిర్మాణానికి నేనే శంఖుస్థాపన చేశా.. పదేండ్లు ఏపీ అభివృద్ధి కోసం సహకరించామని పేర్కొన్నారు. ఏపీని వికసిత్ భారత్‎కు గ్రోత్ ఇంజిన్‎గా తయారు చేయాలని కోరారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందన్నారు.

►ALSO READ | మూడేళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తాం.. మళ్లీ మోడీనే రావాలి: సీఎం చంద్రబాబు

దివంగత ఎన్టీఆర్ వికసిత్ ఏపీ కోసం కలలు కన్నారని.. మనమందరం కలిసి ఆయన కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాలు రైల్వే వ్యవస్థపై ఫోకస్ చేశాయని.. ఇందులో భాగంగానే మేం కూడా రైల్వే వ్యవస్థను ప్రక్షాళిస్తున్నామని తెలిపారు. ఏపీకి రూ.9 వలే కోట్ల విలువైన రైల్వే బడ్జెట్ కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రైల్వేలో వందశాతం విద్యుదీకరణ పూర్తి అయ్యిందని చెప్పారు.