- దేశమంతా దీపావళి చేసుకుంటోంది
- ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలి
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
- త్రేతాయుగంలో ఉన్నట్టుగా ఉంది: యోగి
అయోధ్యం: ‘రాముడు వివాదం కాదు సమాధానం. రాముడు అగ్ని కాదు.. వెలుగు. రాముడే భారత్ కు ఆధారం. ఆయనే భారత్ విధానం. రాముడే నిత్యం.. ఆయనే నిరంతరం. రాముడే విశ్వం.. ఆయనే విశ్వాత్మ.. ఎన్నో బలిదానాలు, త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఇవాళ అయోధ్యకు శ్రీరాముడు వచ్చాడు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం మాట్లాడారు. ‘జై సియా రామ్’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రామ్లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ రోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నాని అన్నారు. జనవరి 22, 2024.. ఇది కేవలం తేదీ మాత్రమే కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని, కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు.
ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. ఈ రోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోందని, ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ, చివరకు న్యాయమే గెలిచించిందన్నారు. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించానని, రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని చెప్పారు. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్టు తెలిపారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించినట్టు చెప్పారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠే కాదు.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని కొనియాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘500 ఏండ్ల కల నెరవేరిందని, అనుకున్న చోటే రామాలయం నిర్మించామని అన్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుందని చెప్పారు. మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుందన్నారు.