న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు ఏడాది తర్వాత దక్కిన వ్యాక్సిన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేస్ట్ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్ ఆయుధాన్ని వేస్ట్ చేయడం బాధాకరమన్నారు. జీరో వేస్టేజీ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సమీక్షలు జరుపుకోవాలని, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలు, హెల్త్ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రం నుంచి గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ‘‘కరోనా వల్ల యావత్ ప్రపంచం ఎంత అల్లాడిందో అందరికీ తెలుసు. ఏడాది తర్వాత మనకు దక్కిన ఆయుధం వ్యాక్సిన్. దాన్ని వేస్ట్ చేయడం బాధకలిగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 10 శాతం కంటే ఎక్కువగా వ్యాక్సిన్ డేస్లు వేస్టు చేస్తున్నరు. ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకు అట్ల జరుగుతున్నదో ఆయా ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. ప్రతి రోజూ సాయంత్రం ప్రత్యేక వ్యవస్థ ద్వారా మానిటరింగ్ చేసుకోవాలి. జీరో వేస్టేజీ టార్గెట్గా ముందుకు వెళ్లాలి. ప్రయత్నం మొదలు పెడితే కానిది ఏదీ లేదు” అని ప్రధాని మోడీ సూచించారు. ఏ రోజు ఎంత వ్యాక్సిన్ వాడాలో సరైన ప్లానింగ్ వేసుకోవాలన్నారు. అధికారులను తాము తప్పుపట్టడం లేదని, వేస్టేజీ సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ఎక్స్పైరీ డేట్ ముగియకముందే వాడితే వేస్టేజీ సమస్య రాదన్నారు. ‘‘మొదట వచ్చిన వ్యాక్సిన్ డోస్లను మొదటే వాడాలి. తర్వాత వచ్చిన డోస్లను తర్వాత వాడాలి. కానీ.. తర్వాత వచ్చిన డోస్లను ముందు వాడి.. ముందు వచ్చిన డోస్లను పక్కన పెట్టడంతో వేస్టేజీ సమస్య ఏర్పడుతోంది. ముందు వచ్చిన డోస్లను అట్లనే ఆపి పెట్టడంతో వాటి ఎక్స్పైరీ డేట్ ముగుస్తోంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది” అని స్పష్టం చేశారు.
తెలంగాణలో 17.6 శాతం..
దేశంలో కరోనా వ్యాక్సిన్ను వేస్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 6.5 శాతం వ్యాక్సిన్ వేస్ట్ అవుతుంటే.. ఒక్క తెలంగాణలోనే 17.6 శాతం పనికిరాకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో 11.6 శాతం వ్యాక్సిన్ వేస్ట్ అవుతున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ వేస్టేజీని అరికట్టాలని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రకటించిన తర్వాత హెల్త్ మినిస్ట్రీ.. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు వ్యాక్సిన్ వేస్ట్ అవుతోందో లెక్కలతో వివరించింది. ‘‘ఎంతో విలువైన వ్యాక్సిన్ వేస్ట్గా పోవడంపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 6.5శాతం వ్యాక్సిన్ వేస్ట్ అవుతుంటే.. తెలంగాణలోనే 17.6శాతం వేస్ట్ అవుతోంది. అటు తర్వాత ఏపీలోనూ ఎక్కువ శాతం వేస్ట్ అవుతోంది. దీన్ని అరికట్టాలని ఆయా రాష్ట్రాలకు మేం సూచించాం” అని నీతి ఆయోగ్ మెంబర్(హెల్త్) డాక్టర్ వీకే పౌల్, హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ చెప్పారు.