ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పోరాడేందుకు నాలుగు దేశాలతో కొత్తగా ఏర్పడిన ‘ఐ2యూ2’ కూటమి నిర్ణయించిందని, దీని కోసం సరికొత్త ఫ్రేం వర్క్స్ ను సిద్ధం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు
న్యూఢిల్లీ : ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పోరాడేందుకు నాలుగు దేశాలతో కొత్తగా ఏర్పడిన ‘ఐ2యూ2’ కూటమి నిర్ణయించిందని, దీని కోసం సరికొత్త ఫ్రేం వర్క్స్ ను సిద్ధం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇండియా, అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ దేశాలు ఉన్న ఈ కూటమి, గురువారం తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమిట్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వర్చువల్గా జరిగిన ఈ మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. నాలుగు దేశాల కూటమే ఐ2యూ2 అని, దీన్ని పశ్చిమ ఆసియాకు క్వాడ్గా కూడా పిలుస్తారని వివరించారు. 3 దేశాల అధినేతలతో జరిగిన ఈ సమిట్ పాజిటివ్ ఎంజెడాతో ప్రారంభమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. చాలా ఏరియాల్లో జాయింట్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని, దీని కోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశామని వివరించారు. వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్తో పాటు ఫుడ్ సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులు పెడ్తామన్నారు.
కూటమి ఎజెండా.. ప్రోగ్రెసివ్, ప్రాక్టికల్
ఐ2యూ2 కూటమి విజన్, ఎజెండా కేవలం ప్రోగ్రెసివ్, ప్రాక్టికల్ అని ప్రధాని మోడీ వివరించారు. ఇండియా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు కూటమి తరఫున యూఏఈ 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చిందని మోడీ ప్రకటించారు. ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల మొదటి అక్షరాలు ‘ఐ2యూ2’ కూటమి ఏర్పాటైందన్నారు.
ఫుడ్ సెక్యూరిటీపై కీలక చర్చ
కూటమి తరఫున 4 దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గుజరాత్లో 300 మెగావాట్ల పవన, సౌర శక్తిని ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లా లని కూటమి నిర్ణయించిందని పేర్కొన్నా రు. ఇది బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలతో ఉంటుందని తెలిపారు. ఆరు కీలక రంగా లపై ఫోకస్ పెట్టామని, జాయింట్ ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఫుడ్ సెక్యూరిటీ క్రైసిస్, స్వచ్ఛమైన విద్యుత్పై ప్రధానంగా చర్చిం చామని వివరించారు. ఆహార వ్యవస్థల ను పెంపొందించేందుకు పరిష్కార మార్గాలపై మాట్లాడుకున్నట్టు తెలిపారు.