- సర్జరీ చేసి కాపాడిన ఉస్మానియా డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: ఓ ఖైదీ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా సర్జరీ చేసి డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. ఖైదీ కడుపులోని 2 మేకులు, ఒక షేవింగ్ బ్లేడ్తో పాటు ఇతర చిన్న వస్తువులు బయటకు తీశారు. చంచల్ గూడ జైలులోని అండర్ ట్రయల్ ఖైదీ ఎండీ సొహైల్(21) తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా చికిత్స కోసం ఎస్కార్ట్ పోలీసులు ఈనెల 8న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు.
అతడిని ఇన్ పేషెంట్ గా చేర్చుకుని, జనరల్ సర్జరీ విభాగం డాక్టర్లు ఎక్స్రేతో పాటు పలు టెస్ట్ లు చేయగా ఖైదీ కడుపులో మేకులు, షేవింగ్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్ కుమార్, జనరల్ సర్జరీ డాక్టర్లతో కలిసి ఎండోస్కోపీ ద్వారా ఖైదీ కడుపులోని మేకులతో పాటు ఇతర చిన్నపాటి వస్తువులను బయటకు తీశారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ డాక్టర్లను, సిబ్బందిని అభినందించారు