సాహో, రాధేశ్యామ్ చిత్రాల పరాజయాలతో..తీవ్ర నిరుత్సాహంలో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రస్తుతం సలార్ మూవీలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ 60 శాతం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సలార్ చిత్రం నుంచి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ను వదిలింది. సలార్లో మలయాళ నటుడు పృథ్వీ రాజ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పృథ్వీరాజ్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ని మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ను విడుదల చేయడం విశేషం.
విలన్..?
సలార్ మూవీలో పృథ్వీరాజ్ `వర్ధరాజా మన్నార్` పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ప్రకారం..ఆయన పాత్ర అతి భయంకరంగా, క్రూరంగా ఉండబోతుందని తెలుస్తోంది. పృథ్వీరాజ్ ముక్కుకి పుడక, మెడలో వెండి కడీలు ధరించాడు. అంతేకాదు నుదుటిపై పొడువైన బొట్టు పెట్టుకుని...ముఖంపై గాట్లు, కళ్లల్లో కోపం, క్రూరత్వం, చెవికి రింగులతో అత్యంత భయానకంగా ఉన్నాడు. ఈ లుక్ను చూస్తుంటే..సలార్లో పృథ్వీరాజే విలన్గా కనిపించబోతున్నారా అనే అనుమానం కలుగుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే..
సలార్ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని...2023లో సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా నెగటివ్ రోల్ చేస్తున్నారు.