
- ఇయ్యాల మరోసారిడిప్యూటీ సీఎంతో భేటీ
- రూ. 7,500 కోట్ల ఫీజు బకాయిలను విడతలవారీగా
- విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం డిమాండ్ చేస్తున్న ప్రైవేట్కాలేజీల మేనేజ్మెంట్లతో రాష్ట్ర సర్కారు జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ 15 నుంచి ప్రొఫెషనల్ కాలేజీల బంద్కు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతీ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలూ బంద్ చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో ఫతీ చైర్మన్ రమేశ్బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితరులు వేర్వేరుగా చర్చలు జరిపారు.
ప్రస్తుతం రూ.7,500 కోట్ల వరకూ ఫీజు బకాయిలు ఉన్నాయని, వాటిని విడతలవారీగా రిలీజ్ చేయాలని ఫతీ ప్రతినిధులు కోరారు. ముందుగా ప్రభుత్వం టోకెన్లు జారీచేసిన రూ.1,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని, తద్వారా సిబ్బందికి వేతనాలు అందిస్తామని ప్రభుత్వ పెద్దలకు వివరించారు. సర్కారు వద్ద నిధులు లేవని, కాస్త టైమ్ ఇవ్వాలని వారికి సర్కారు ప్రతినిధులు సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4,500 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. దీనికి మేనేజ్మెంట్లు ఒప్పుకోలేదు. తాము ఆదివారం ఫతీ జనరల్ బాడీ సమావేశం పెట్టుకున్నామని, ఇందులో బంద్పై స్పష్టత ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అయితే, డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్లాల్సి ఉండడంతో.. చర్చలను ఆదివారం సాయంత్రం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేస్తేనే బంద్ ఆలోచన
విరమిస్తామని కాలేజీల మేనేజ్మెంట్లు స్పష్టం చేసినట్టు తెలిసింది.