![ఫీజు రీయింబర్స్ మెంట్..బకాయిలు రిలీజ్ చేయండి](https://static.v6velugu.com/uploads/2024/04/private-colleges-management-requested-cm-revanth-reddy-over-fee-reimbursement-dues_FNIYuEegA1.jpg)
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల్లోని స్టూడెంట్ల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో 14 లక్షల మంది స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏటా రూ.700 కోట్లు అవసరమని వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరారు. ఏటా డిసెంబర్ 31లోగా రెన్యూవల్ స్టూడెంట్ల ఫీజును, మార్చి 31లోగా ప్రెష్ స్టూడెంట్ల ఫీజులను చెల్లించాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.